Internship for Engineering Students: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ (Internship) చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు డిసెంబరు 20న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని బీటెక్ (B.Tech), ఎంటెక్ (M.Tech) చివరి సంవత్సరం చదివే విద్యార్థులతో.. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదివే విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఇంజినీరింగ్ కళాశాలలతో అనుసంధానించింది. 


ఇంజినీరింగ్ చదివే ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలలను కేటాయించనున్నారు. సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్ బ్రాంచి చదివే విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించనున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ట్యాబ్‌లపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. డిజిటల్ టెక్నాలజీ అనుబంధ సబ్జెక్టుల బోధనపై టీచర్లకు శిక్షణ ఇస్తారు. వీరిని ఫ్యూచర్ 'స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్‌'గా పరిగణిస్తారు. 


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా మేనేజ్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, వెబ్-3.0 వంటి నైపుణ్యాలపై విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో ఇంజినీరింగ్ విద్యార్థికి ఇంటర్న్‌షిప్ కింద నెలకు రూ.12,000 ఇవ్వనున్నారు. అలాగే ప్రయాణ ఖర్చుల నిమిత్తం కిలోమీటరుకు రూ.2 చొప్పున ఛార్జీలు చెల్లిస్తారు. జనవరి 6 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


ALSO READ:


ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 'గ్రేస్‌' మార్కులు, ఉత్తర్వులు జారీచేసిన జేఎన్‌టీయూ
జేఎన్‌టీయూ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలుపుతూ జేఎన్‌టీయూ యూనివర్సిటీ (JNTU) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు డిసెంబరు 18 ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 30 మార్కులు, డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 23 మార్కులు కలుపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలిపామని, ఈసారి విద్యార్థులు కోరడంతో ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్‌‌లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు..
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. నోటిఫికేషన్‌ను ఉపకులపతి పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్ అడ్మిషన్స్ కేవీ క్రిష్ణకిషోర్, డైరెక్టర్ గౌరీశంకరరావు నవంబరు 22న విడుదల చేశారు. ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...