Non-Local Quota Admissions: తెలంగాణ(Telangana)లోని విద్యాసంస్థల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 15 శాతం నాన్‌లోకల్ కోటా సీట్ల (Non Local Quota Seats) భర్తీని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏపీ విద్యార్థులు నాన్‌లోకల్ కోటా సీట్లు దక్కించుకునే అవకాశం ఉండనుంది. ప్రభుత్వ స్థాయిలో ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై సంకేతాలు ఇవ్వడంతో వారంరోజుల్లో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. 


రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాన్‌-లోకల్ కోటా సీట్లు 15 శాతం కింద ఏపీ విద్యార్థులు పోటీపడటానికి వీలుందా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలపాలని ఉన్నత విద్యామండలి గత నెలలో సర్కారుకు లేఖ రాయగా.. ఏపీ పునర్విభజన చట్టానికి జూన్ 2కు పదేళ్లు పూర్తికానుంది. ఇప్పటివరకు ఎంసెట్‌తోపాటు ఆయా కోర్సుల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడుతున్నారు. అందులో మెరిట్‌ను బట్టి సీట్లు కేటాయిస్తున్నారు. దీనిప్రకారం ఏటా సుమారు 4 వేల మంది వరకు ఏపీ విద్యార్థులు కన్వీనర్ కోటా కింద బీటెక్‌లో ప్రవేశాలు పొందుతూ వస్తున్నారు.


సీట్ల మిగులే కారణం..
ఏపీ విద్యార్థులు ప్రధానంగా కన్వీనర్ కోటా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసమే పోటీపడుతుంటారు. ఉన్నత విద్యామండలి లేఖ రాసిన నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో దీనిపై ఇటీవల చర్చ జరిగింది. వచ్చే జూన్ 2 లోపు పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినా సమస్య లేదని, ప్రవేశాల నోటిఫికేషన్ మాత్రం జూన్ 2 తర్వాత జారీచేస్తే 100 శాతం కన్వీనర్ కోటా సీట్లు స్థానికులకు దక్కుతాయని కొద్ది రోజుల క్రితం వరకు భావిస్తూ వచ్చారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌కు ఏపీ విద్యార్థులు దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేస్తున్నందున ముందుగా ప్రవేశాల గురించి చెప్పాల్సి వస్తుందని.. పరీక్ష రాసిన తర్వాత సీట్లు ఇవ్వమంటున్నారని న్యాయస్థానానికి వెళితే సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దానికితోడు 15 శాతం నాన్-లోకల్ కోటాలో పోటీపడేది ఒక్క ఏపీ విద్యార్థులే కాదు. మరోవైపు ఇప్పటికే కన్వీనర్ కోటాలో 20% సీట్లు మిగిలిపోతున్నాయి. ఒకవేళ జూన్ 2 తర్వాత ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే? అనే ప్రశ్నా తలెత్తింది. అప్పుడు జాతీయ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు సంబంధించి సమస్యలు రావొచ్చని కొందరు అధికారులు చెప్పినట్లు సమాచారం. వీటన్నింటికితోడు రాజకీయ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ సారికి యథావిధిగా ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.


త్వరలో 'సెట్ల' తేదీలు..
ఉన్నత విద్యామండలి లేవనెత్తిన సందేహాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో.. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ ఆన్‌లైన్ పరీక్షల ప్రాథమిక షెడ్యూలును అధికారులు సిద్ధం చేశారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం పొందే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వారంలోనే పరీక్షల తేదీలను వెల్లడించనున్నారు. మే నెలలోనే దాదాపు అన్ని పరీక్షలను పూర్తిచేసే అవకాశం ఉంది. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..