Half day Schools in AP: ఆంధ్రప్రదేశ్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు (Half days Schools) ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో మార్చి మొదటివారం నుంచే ఒంటిపూట బడులను నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
తీవ్ర ఎండల నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సి పల్, మోడల్స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటిపూట బడులు పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది.
మార్చి 17 నుంచి పదోతరగతి పరీక్షలు..రాష్ట్రంలో మార్చి 17 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 లేదా ఏప్రిల్ 1న పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.