డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(దోస్త్‌) రెండో విడత సీట్ల కేటాయింపులో భాగంగా 49,267 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఆయా వర్సిటీల ఉపకులపతులు, రిజిస్ట్రార్లతో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, మహమూద్‌ సమావేశం నిర్వహించారు. నైపుణ్య కోర్సులపై దృష్టిపెట్టాలని, జిల్లాల్లోనూ విద్యార్థులకు దోస్త్‌పై అవగాహన పెంచాలని కరుణ సూచించారు.


అనంతరం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సీట్లను కేటాయించడంతోపాటు మూడో విడత ప్రవేశ షెడ్యూలును వెల్లడించారు. మూడో విడత రిజిస్ట్రేషన్‌ను జులై 1 నుంచి 14 వరకు రూ.400 రుసుం చెల్లించి చేసుకోవచ్చు. వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్న వారికి 20న సీట్లు కేటాయిస్తారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. తాజాగా సీట్లు పొందిన వారు జులై 1 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీటు రిజర్వ్‌ చేసుకోవాలని సూచించారు. రెండు విడతల్లోనూ సీట్లు పొందిన వారు కూడా మళ్లీ చేయాలన్నారు. 


రెండో విడతలో సీట్లు పొందిన వారిలో కామర్స్‌(బీబీఏ సహా)- 21,255, లైఫ్‌ సైన్సెస్‌- 11,944, ఫిజికల్‌ సైన్సెస్‌- 9,076, ఆర్ట్స్‌- 6,307, డేటా సైన్స్‌- 431, ఇతర కోర్సులో 81 మంది ఉన్నారు. తొలి విడతలో 73,220 మంది సీట్లు దక్కించుకున్నా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 49 వేల మందే చేశారు. 


జులై 14 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు..


మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జులై 1 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. జులై 1 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. విద్యార్థులకు జులై 20న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు జులై 21 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 27 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభంకానున్నాయి.


రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతంలోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్‌ చేశారు. 


'దోస్త్' నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Website


ALSO READ:


ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని,  ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial