CPGET 2023: తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ఈ ఏడాది సగం కూడా నిండలేదు. ఎంఏ (MA), ఎంకాం(M.COM), ఎంఎస్సీ(MSc) కోర్సుల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష(CPGET)' కౌన్సెలింగ్‌లో భాగంగా కన్వీనర్ కోటాలో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ విద్యాసంవత్సరం కేవలం 20,484 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 40.96 శాతం సీట్లు మాత్రమే నిండాయి. అయితే గత విద్యాసంవత్సరం(2022-23)తో పోల్చితే ప్రవేశాలు పెరిగినప్పటికీ.. ఈసారి కూడా సగానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. గతేడాది 19,121(38.24) సీట్లు మాత్రమే భర్తీకాగా.. ఈసారి 20,484 సీట్లు నిండాయి. ఈసారి 1,363 సీట్లు అధికంగా భర్తీ కావడం గమనార్హం. 


సీట్ల వివరాలు..
పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఎంఎస్సీ (రసాయనశాస్త్రం)లోనే ఎక్కువ మంది చేరుతూ వస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఎంకాం నిలుస్తోంది. ఈ సారి కొత్తగా ఎంఎస్సీ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు. అందులో 400 సీట్లకుగాను 231 మంది ప్రవేశాలు పొందారు. అలాగే, ఎంఎస్సీ ఫుడ్‌సైన్స్, ఎంఎస్సీ న్యూట్రిషన్ కోర్సుల్లో ఈ సారి ప్రవేశాలు పెరగడం విశేషం. మొత్తం పీజీ సీట్లలో 80 శాతాన్ని కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 20 శాతం యాజమాన్య కోటాలోని సీట్లలో 1000-1500కు మించి చేరటం లేదు. కన్వీనర్ కోటాలోని సీట్లు మిగిలిపోతుండగా.. యాజమాన్య కోటా కింద అధిక ఫీజులు చెల్లించి చేరే వారు చాలా తక్కువగా ఉంటున్నారని ఆయన వివరించారు.


అమ్మాయిలదే పైచేయి..
పీజీలో మొత్తం 48 కోర్సులు ఉన్నాయి. వాటిలో జాగ్రఫీ, ఎంపీఎడ్, టూరిజం, లైబ్రరీ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ తదితర కోర్సుల్లో తక్కువగా చేరుతుంటారు. వీటిలో చేరే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని కోర్సుల్లో 70-80 శాతం అమ్మాయిలే ఉంటున్నారని సీపీగెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఎంకాం, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి. స్టాటిస్టిక్స్‌లో 417 సీట్లకు గాను 358 మంది మహిళలే ఉన్నారు. ఎంఏ రాజనీతిశాస్త్రంలో చేరిన 636 మందిలో 330 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. గత విద్యాసంవత్సరం ఎమ్మెస్సీ గణితంలో 1445 మంది చేరగా 1192 మంది మహిళలే. మొత్తం మీద గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు మూడొంతుల మంది అమ్మాయిలే పీజీ కోర్సుల్లో చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరే అబ్బాయిల సంఖ్య భారీగా తగ్గుతోంది. వారంతా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల వైపు వెళ్తున్నారని, అమ్మాయిలు మాత్రం సంప్రదాయ డిగ్రీలో చేరి తర్వాత పీజీ చదువుతున్నారని నిపుణులు చెబుతున్నారు.


ALSO READ:


ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్ వెల్లడి
చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- 2024 విద్యా సంవత్సరానికి ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా యూజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ ఇంజినీరింగ్ గ్రాఫిక్స్/ బోటనీ/ జువాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫేజ్ 1 ఏప్రిల్ 13, ఫేజ్ 2 జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...