తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసేందుకు యూజీసీ వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాధారణ డిగ్రీలో ఒక పక్క ఆనర్స్, మరో పక్క ఒకే సబ్జెక్టు ప్రాధాన్య కోర్సును తీసుకురానున్నారు. 2020-21లో ప్రవేశపెట్టిన ఆనర్స్‌ డిగ్రీకి సంబంధించి నాలుగో ఏడాది సిలబస్‌ను ఖరారు చేశారు. దీంతోపాటు ఇప్పటివరకు మూడు సబ్జెక్టుల ప్రాధాన్యంగా ఉన్న డిగ్రీని ఒక సబ్జెక్టు విధానానికి మార్చుతున్నారు. యూజీసీ, జాతీయ విద్యా విధానం సూచనల ప్రకారం ఉన్నత విద్యామండలి ఈ మార్పులు చేస్తోంది. 


ఉన్నత విద్యామండలి 2020-21నుంచి నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని ప్రవేశపెట్టింది. ఇందులో విద్యార్థులు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు మూడేళ్లు పూర్తి చేశాక బయటకు వెళ్లిపోవాలనుకుంటే మూడేళ్ల డిగ్రీని ప్రదానం చేస్తారు. నాలుగో ఏడాది చదవాలనుకునే వారి కోసం కొత్తగా సిలబస్‌ను సిద్ధం చేశారు. మూడేళ్లలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఆనర్స్‌ విత్‌ రిసెర్చ్‌లో ప్రవేశాలు పొందవచ్చు. ఒకవేళ ఇంతకంటే తక్కువ మార్కులు వచ్చినవారు ఆనర్స్‌లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుత డిగ్రీ విద్యార్థులే మొదటిసారి ఆనర్స్‌ చదివేవారు కానున్నారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేస్తే ఆ మేరకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఏడాది ఆదా అవుతుంది. ఆనర్స్‌ పరిశోధన పూర్తిచేసిన వారు మాత్రం నేరుగా పీహెచ్‌డీలోనూ ప్రవేశం పొందవచ్చు. 


ఆనర్స్‌ డిగ్రీలో రెండు సెమిస్టర్లకు కలిపి 10పేపర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో సబ్జెక్టుకు సంబంధించినవి మూడు కోర్సులు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించినవి రెండు కోర్సులుంటాయి. వీటితోపాటు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ డిసిప్లినరీ కోర్సు చేయాలి. రెండో సెమిస్టర్‌ ఇలాగే ఉంటుంది.
 ఆనర్స్‌ పరిశోధనలో మాత్రం మొదటి సెమిస్టర్‌లో మూడు సబ్జెక్టులు, రెండు రీసెర్చ్‌ మెథడాలజీవి ఉంటాయి. ఎనిమిదో సెమిస్టర్‌ పూర్తిగా ప్రాజెక్టు వర్క్‌ ఇస్తారు. నాలుగో ఏడాది తర్వాత పరిశోధన వైపు వెళ్లాలనుకుంటే ఆర్‌సెట్‌ ద్వారా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందవచ్చు. లేదంటే పీజీలోనూ చేరేందుకు అవకాశముంటుంది. 


మూడు సబ్జెక్టుల విధానానికి స్వస్తి...
డిగ్రీ విద్యలో మూడు సబ్జెక్టుల విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయనున్నారు. దీని స్థానంలో ఒక సబ్జెక్టు విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బీఎస్సీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలుంటే కొత్త విధానంలో ఏదైనా ఒక సబ్జెక్టు ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. మిగతా రెండింటి స్థానంలో మైనర్‌గా నచ్చినవి చదువుకోవచ్చు. ఈ విధానం ఇప్పటికే కర్ణాటక, తమిళనాడుతోపాటు చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ డిగ్రీ కోర్సు సిలబస్‌ను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. దీనికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసింది. 60శాతం ఆఫ్‌లైన్, 40శాతం ఆన్‌లైన్‌లో చదువుకునే అవకాశం కల్పించడంపైనా ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. ఆన్‌లైన్‌లోనూ మైనర్‌ డిగ్రీలు చదువుకోవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసేందుకు యూజీసీ వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆ విధానం అమలుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఒకేసారి ఆఫ్‌లైన్‌లో రెండు డిగ్రీలు చేయాల్సి వస్తే విద్యార్థులకు సమయాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆన్‌లైన్, మరొకటి ఆఫ్‌లైన్‌ అయితే సమయం సర్దుబాటుకు ఇబ్బందులు ఉండబోవని విద్యాసంస్థలు భావిస్తున్నాయి.


Also Read:


ఏపీలో 'ఈ–పాఠశాల' ఎంతో ప్రత్యేకం, విద్యార్థులకు డిజిటల్ పాఠాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న సంస్కరణలు పాఠశాల విద్యకు కొత్త ఊపిరులు అందిస్తోంది. ఇప్పటికే బైజూస్‌ ద్వారా స్మార్ట్‌ ఫో­న్లలో, ట్యాబ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ అంది­స్తున్న ప్రభుత్వం త్వరలో ఈ–పాఠశాలను ప్రవే­శపెడుతోంది. ఇందులో భాగంగా ఎస్‌సీ­ఈ­ఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్‌ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్‌ విద్యాబోధన అందిస్తోంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..