దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు ఇక కాలం చెల్లనుందా అంటే? అవును అనే సమాధానం వినిపిస్తోంది. 'ఒకే దేశం - ఒకే ప్రవేశపరీక్ష' విధానాన్ని అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం నీట్ తరహాలోనే ఇంజినీరింగ్‌కి కూడా జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి 2016 నుంచి నీట్ నిర్వహిస్తుండగా.. గతేడాది నుంచి దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 


2023-24 విద్యాసంవత్సరం నుంచి 57 కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టనున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్లను కూడా జాతీయ ప్రవేశపరీక్ష ద్వారానే నింపుతామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. కాగా అన్ని రాష్ట్రాల్లోని బీటెక్ సీట్ల భర్తీకి కూడా జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జరపాలని 2016 నుంచే కేంద్రం యోచిస్తోంది. ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీకి 2013 నుంచి జేఈఈ మెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ పరీక్షలో అన్ని రాష్ట్రాలు చేరితే ఇంజినీరింగ్ ప్రవేశాలకు వినియోగించుకోవచ్చన్నది ఆలోచన. ఈమేరకు అప్పట్లో కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందించింది. అనంతరం ఆ అంశం మరుగున పడింది.


ఐఐటీ కౌన్సిల్ సమావేశం ఏప్రిల్ 18న భువనేశ్వర్ ఐఐటీలో జరిగింది. దేశంలోని 23 ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ ఛైర్మన్లు, యూజీసీ, ఏఐసీటీఈ ఛైర్మన్లతో పాటు ఐఐటీ కౌన్సిల్ ఛైర్మన్‌గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎజెండాలో భాగంగా ఇంజినీరింగ్‌కు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సానుకూలతలు, ప్రతికూలతలను లోతుగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి కోరారు అని ఐఐటీ గవర్నింగ్ బాడీ ఛైర్మన్ ఒకరు తెలిపారు. ఒక విధానం నుంచి మరో విధానానికి మారాలంటే కొంత సమయం పడుతుందని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రవేశపరీక్షకు రెండు లేదా మూడేళ్ల సమయం ఇస్తామని వివరించారు. ఈ విషయమై ఒక నిర్ణయానికి వస్తే.. 2025-26 నుంచి అమలుకు అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 


ఐఐటీల్లో సీట్ల భర్తీకి ప్రస్తుతం జరుపుతున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను రద్దుచేసి దాన్ని కూడా ఉమ్మడి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలోకి తీసుకురావాలన్న అంశం కూడా చర్చకు రాగా ఎక్కువ మంది డైరెక్టర్లు, ఛైర్మన్లు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. దానివల్ల ఐఐటీల్లో నాణ్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమైనట్లు సమాచారం. కాగా నీట్, జేఈఈ మెయిన్‌లను కూడా సీయూఈటీలో విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. యూజీసీ ఛైర్మన్ ఎం. జగదీష్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది సాధ్యం కాకుంటే ఇంజినీరింగ్‌కు ప్రత్యేకంగా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష జరిపే దిశగా కేంద్రం యోచిస్తోంది.


Also Read:


కొత్త డిగ్రీలు ఇక నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం(2023-24) నుంచి మూడేళ్ల వ్యవధితో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్‌సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా తాజాగా దాన్ని నాలుగేళ్లకు పెంచనున్నారు. ఈ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా సిలబస్‌కు రూపకల్పన చేస్తున్నారు. కృత్రిమమేధ, సైబర్‌సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌!
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఎంత ధనికులైనా అక్కడి విద్యార్థులకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయడం అనేది వారి కరిక్యులమ్​లో ఓ భాగంగా ఉంటుంది. దీనివల్ల వారికి సంపాదన విలువ తెలియడమే గాక.. ఇండిపెండెంట్​గా ఉండే స్వభావం అలవాటవుతుందని అక్కడి విద్యాసంస్థలు భావిస్తుంటాయి. ఇప్పుడు మనదేశంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కార్యచరణ సిద్ధం చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..