ప్రకాశం జిల్లా యర్రగొండుపాలెంలో రాత్రి హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఓవైపు చంద్రబాబు టూర్ అదే టైంలో ఆయనకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ నిరసన చేపట్టారు. ఈ రెండింటి మధ్య పోలీసులు, భద్రతా సిబ్బంది కాసేపు హడావుడి నడిచింది. ఓవైపు రాళ్లవర్షం మరోవైపు పోలీసులు లాఠీఛార్జ్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రకాశం జిల్లా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలతో ఆయన టూర్‌ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ సీన్‌లోకి రావడంతో ప్రశాంతంగా ఉన్న సిట్చుయేషన్ ఒక్కసారిగా వైల్డ్‌గా మారిపోయింది. 


దళితులకు క్షమాపణ చేప్పిన తర్వాత తన నియోజకవర్గంలో పర్యటించాలని ఆదిమూలపు సురేష్‌ తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆదిమూలపు సురేష్ పిలుపుతో భారీగా పార్టీ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. నల్ల జెండాలు, బెలూన్లు పట్టుకొని టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ స్లోగన్స్‌ ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా బ్లాక్ టీషర్టుతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సీన్‌ హీట్ పెంచారు. 
మరోవైపు అదే రూట్‌లో వస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన వెంటనే భారీగా పార్టీ శ్రేణులు ఫాలో అయ్యారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ పోలీసుల్లో కనిపించింది. రోజుంతా కనిపించిన హైడ్రామా రాత్రికి మరింత వేడి పుట్టించింది. 


ఉదయం నుంచి సాయంత్ర వరకు అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు చంద్రబాబు వచ్చే టైంలో కూడా నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌కు, ఆదిమూలపు సురేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగానే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 






ఆవేశకావేశాలతో కర్రలు, రాళ్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా గాయాలు అయ్యాయి. ఒకానొక దశలో మంత్రి ఆదిమూలపు సురేష్ షర్ట్ విప్పి రండిరా చూసుకుందాం అంటూ టీడీపీ లీడర్లకు సవాల్ చేశారు. 






రెండు వర్గాలు రెచ్చిపోవడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎవర్ని సర్ది చెప్పలేక, నేతలకు భద్రత కల్పించలేక తలలు పట్టుకున్నారు. చివరకు లాఠీలకు పని చెప్పి అక్కడి వారందర్నీ తరిమేశారు. సుమారు కొన్ని గంటలపాటు సాగిన హైడ్రామా పర్యటన ముగిసే వరకు కొనసాగింది. రెండు వర్గాల నినాదాలతో యర్రగొండుపాలెం అట్టుడుకిపోయింది.