Education in mother tongue: దేశంలోని అన్ని విద్యాసంస్థలన్నీ పాఠ్యాంశాలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులకు మాతృ భాషల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించాని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలు, యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీఆర్‌టీ, ఎన్‌ఐఎంఎస్, ఇగ్నో, ఐఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఎన్‌ఐటీలకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మూడేళ్లలో అన్ని కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాతృభాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది.


దేశంలోని విద్యా వ్యవస్థలో ప్రతి స్థాయిలో బహుభాషా మాధ్యమాన్ని ప్రోత్సహించడానికి నూతన విద్యా విధానం చేసిన సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు విద్యా శాఖ తెలిపింది. దీనివల్ల విద్యార్థులకు మాతృభాషల్లో చదువుకొనే అవకాశం లభిస్తుందని, తద్వారా వారిలో అభ్యాస సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించింది. సొంత భాషల్లో చదువుకోవడం వల్ల విద్యార్థులు వినూత్నంగా, విస్తృతంగా ఆలోచించగలుగుతారని వివరించింది.


ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన సీబీఎస్ఈ..
మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది.


ప్రస్తుతం సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో హిందీలో బోధిస్తున్నారు. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో పాఠశాలలు ఇకపై తమకు నచ్చిన భారతీయ భాషల్లో విద్యాబోధన చేసేందుకు వీలవుతుంది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో భిన్న భాషల్లో విద్యాభోధన అమలుచేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను అన్వేషించాలని, నిపుణులతో సంప్రదింపులు జరుపాలని, ఇతర పాఠశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ జోసెఫ్‌ ఇమ్మానుయేల్‌ పాఠశాలలకు సూచించారు. 


2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలు తమ మాతృభాషపై ప్రత్యేకదృష్టి సారించడంతోపాటు ఇతర భాషలను తెలుసుకుంటే, బహు భాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యావిధానం-2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం 5వ తరగతి వరకైనా ఈ విధానం అనుసరించాలని, 8వ తరగతి.. ఆ తర్వాత కూడా ఇదే విధానం మేలని నిర్దేశిస్తోంది.  బహుభాషా విద్యావిధానం అమలుకు, బోధనా భాషగా మాతృభాష వాడకానికి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.


భిన్న భాషల్లో బోధించే సామర్థ్యమున్న నిపుణులైన టీచర్లు దొరకడం, నాణ్యమైన బహుభాషా పాఠ్యపుస్తకాల లభ్యత కష్టమవుతోంది. ఈ సవాళ్ల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భారతీయ భాషల ద్వారానే విద్యాబోధన కొనసాగించేందుకు కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకొంది. ఆ సంస్థ వెంటనే ఈ పనిని ప్రారంభించినందున వచ్చే సీజను నుంచి పిల్లలకు 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు.. ఉన్నత విద్యారంగంలోనూ భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల ముద్రణ పని మొదలైంది. ఇంగ్లిష్‌ మాధ్యమానికి అదనంగా భారతీయ భాషల్లో బోధన, అభ్యాస ప్రక్రియ కొనసాగించడానికి, పరీక్షలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..