ఏపీ ఎడ్‌సెట్‌ 2022 ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా శాఖా మండలి అక్టోబరు 21న వెల్లడించింది. ఇప్పటికే ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 22 నుండి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎడ్‌సెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబరు 22 నుంచి  27 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిష్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 26 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.


Also Read: కటాఫ్ తగ్గింపుతో అర్హత సాధించినవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అభ్యర్థులకు కేంద్రం సూచన!

అదేవిధంగా పీహెచ్‌సీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ లాంటి ప్రత్యేక కేటగిరీల్లో అభ్యర్ధుల దరఖాస్తులను అక్టోబరు 27న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు 1 నుండి 3 వరకు అభ్యర్థులు వెబ్‌ అప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 3 వరకు వెబ్‌ఆప్షన్లలో మార్పులుంటే సరిచేసుకోవచ్చు. ఇక నవంబరు 5న మొదటి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. నవంబరు 7 నుండి 9 తేదీల్లోపు సీట్ల కేటాయించిన కాలేజీలకు వెళ్లి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. నవంబరు 7  నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. 


కౌన్సెలింగ్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..



ఎడ్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్ షెడ్యూలు..


✪ నోటిఫికేషన్ వెల్లడి: 21.10.2022.


✪ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ: 22.10.2022 - 27.10.2022.


✪ సర్టిఫికేట్ల పరిశీలన: 26.10.2022 - 31.10.2022.


✪ స్పెషల్ కేటగిరీ (పీహెచ్‌సీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌) అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్: 27.10.2022 


✪ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ: 01.11.2022 - 03.11.2022.


✪ వెబ్ ఆప్షన్లలో మార్పులు: 04.11.2022.


✪ సీట్ల కేటాయింపు: 05.11.2022.


✪ కళాశాలలో రిపోర్టింగ్:  07.11.2022 - 09.11.2022


✪ తరగతులు ప్రారంభం: 07.11.2022.



కౌన్సెలింగ్ ఫీజు ఎంతంటే?


ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు మొదట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.



ఏపీలో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఏపీఎడ్‌సెట్‌- 2022 జులై 13న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 13,978 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 11,384 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,594 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా, 81.44 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 


Also Read: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!


ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి మే 13 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. పరీక్షలను జులై 13న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.


ఎడ్‌సెట్‌ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు పొందిన మార్కులు, ర్యాంకు, ఎంచుకున్న మెథడాలజీ ఆధారంగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి.. సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు. గత ఏడాది కౌన్సెలింగ్‌ గణాంకాల ప్రకారం–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పరిధిలోని 482 కళాశాలల్లో దాదాపు 35 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 



Read Also:  యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తు షెడ్యూలు ఇదే!



బీఈడీతో కెరీర్‌..
✪ ఎడ్‌సెట్‌లో ర్యాంకు ఆధారంగా బీఈడీ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో బోధన రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. 
✪ బీఈడీ తర్వాత టెట్‌లో ఉత్తీర్ణత, ఆ తర్వాత డీఎస్సీలోనూ విజయం సాధిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌లుగా కెరీర్‌ ప్రారంభించొచ్చు.
✪ ఉద్యోగం చేస్తూనే పీజీ కూడా పూర్తి చేస్తే.. భవిష్యత్తులో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్, జూనియర్‌ లెక్చరర్‌ హోదాలకు సైతం చేరుకోవచ్చు.
✪ జాతీయ స్థాయిలో నిర్వహించే సెంట్రల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)లో అర్హత ఆధారంగా కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా అవకాశం దక్కించుకోవచ్చు.
✪ ఎడ్‌టెక్‌ సెక్టార్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్స్‌లోనూ ఉపాధ్యాయులుగా కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు.


అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకున్న వాటి నుంచే ప్రశ్నలు అడుగుతారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..