AP Tenth Class Results: ఏపీలో ఇటీవల పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదోతరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్‌, మార్చి 20న ఇంగ్లిష్, మార్చి 22న మ్యాథమెటిక్స్, మార్చి 23న ఫిజికల్ సైన్స్, మార్చి 26న బయాలజీ, మార్చి 27న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించగా.. మార్చి 28, 30 తేదీల్లో వొకేషనల్ పరీక్షలు నిర్వహించారు.


ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు ముగియగానే అధికారులు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 8తో ముగియనుంది. విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు పూర్తిచేయనున్నారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇదంతా పూర్తవడానికి కనీసం రెండువారాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్‌ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు.


లోక్‌స‌భ, అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో.. అత్యంత వేగంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్షల పరీక్షాపత్రాల మూల్యాంక‌నం చేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలో పదోతరగతి పరీక్షలకు 7 లక్షలకుపైగా విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.30 లక్షలు, గతేడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రఅసెంబ్లీకి మే 13న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆలోపే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ చివరినాటికి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


గతేడాది 18 రోజుల్లోనే ఫలితాలు..
ఏపీలో గతేడాది పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు నిర్వహించారు. ఫలితాలను మే 6న విడుదల చేశారు. అంటే పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మాత్రం నెలరోజుల సమయం పట్టేలా కనిపిస్తుంది. అయితే ఫలితాల వెల్లడికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అనకున్నదానికన్న అన్ని ప్రక్రియలు పూర్తయితే వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని అధికారులుభావిస్తున్నారు.


విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in , www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు..  దీంతోపాటు టీవీ9 వెబ్ సైట్‌ లో కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.


AP SSC ఫలితాలను ఇలా చూసుకోండి..


➥  విద్యార్థులు ఫలితాల కోసం మొదట BSEAP అధికారిక సైట్‌ని సందర్శించాలి-bse.ap.gov.in.


➥ హోమ్‌పేజీలో అందుబాటులో 'AP SSC 2024 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.


➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి, సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.


➥ పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.


➥ ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...