ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. పేదవిద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందేందుకు మార్గం సుగమం చేస్తూ.. కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు.. అదికూడా అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్‌ కోర్సులు ఉచితంగా అందించనుంది. ఈ మేరకు ఆగస్టు 17న ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్ కంపెనీ 'ఎడెక్స్‌'‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదర్చుకుంది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎడెక్స్‌ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్‌ అగర్వాల్‌ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. 


రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో మరింత ప్రయోజనం చేకూరనుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. 


ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.  ఆధునికతను అందిపుచ్చుకోవడం, నాణ్యమైన విద్యను అందచేయడం లక్ష్యంగా ఈ కోర్సులను తీర్చిదిద్దాలని జగన్ తెలిపారు. ఈ కోర్సులకు వర్టికల్స్‌ కూడా ఉండాలన్నారు. విద్యార్థి తనకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకుని చదువుకునే అవకాశం ఉండాలన్నారు. దీనికోసం ఇప్పుడున్న ప్రతికోర్సులనూ, అందులో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులను పూర్తిగా పరిశీలించాలన్నారు. దీనికోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలన్నారు.


మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులే కాకుండా.. ఆర్ట్స్‌, కామర్స్‌ విభాగాల్లోనూ పలురకాల కోర్సులు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. 


విదేశాలకు వెళ్లి చదువుకోవడం అన్నది చాలామంది విద్యార్థులకు గగనమైన విషయమని, అలాంటిది ఆయా యూనివర్శిటీల కోర్సులను, అందులోనూ ప్రపంచ ప్రసిద్ధిచెందిన యూనివర్శిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే అవకాశం ఈ ఒప్పందంతో లభిస్తుందని సీఎం తెలిపారు. ప్రపంచంలో అనూహ్యంగా వస్తున్న శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన మార్పులపై ఉన్న వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు.