అమరావతి: భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఒంటి పూట బడులపై నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి (మార్చి 16, సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. పెరిగిన ఎండల దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Continues below advertisement

విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహార విషయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో యథావిధిగా రాగిజావ, మధ్యాహ్నం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందుతాయని జీవోలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవే టైమింగ్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Continues below advertisement