ఏపీలోని యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పీజీసెట్‌–2023 తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి నవంబరు 3న పత్రికా ప్రకటన విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ నవంబరు 5 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.


ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. పీజీసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. పరీక్షలో అర్హత సాధించిన నవంబరు 6 నుంచి 8 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులకు రూ.500గా ఫీజు చెల్లించాలి. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్‌ ఆప్షన్ల నమోదు వంటి ప్రక్రియలకు కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. హాల్‌టిక్కెట్‌, పుట్టినతేదీ వివరాల ఆధారంగా లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ఫీజు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు. అనంతరం విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.


పీజీసెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబరు 12 నుంచి 23 వరకు రిజిస్ట్రేషన్‌‌కు అవకాశం కల్పించారు. వీరికి సెప్టెంబరు 13 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌ ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించారు. సెప్టెంబరు 24 నుంచి 29 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి సెప్టెంబరు 30న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. చివరగా అక్టోబరు 6న సీట్లను కేటాయించారు. సంబంధిత కళాశాలలో చేరేందుకు అక్టోబరు 10 వరకు అవకాశం కల్పించారు. మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి తుది విడత నోటిఫికేషన్‌ను ఉన్నతవిద్యామండలి తాజాగా విడుదల చేసింది. 


ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 6 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌-2023 ఫలితాలను జులై 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పీజీ సెట్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహించారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్‌ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తున్నారు.


అవసరమైన ధ్రువీకరణ పత్రాలు..
➥ పీజీసెట్ హాల్‌టికెట్
➥ పీజీసెట్ ర్యాంకు కార్డు
➥ బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ)
➥ డిగ్రీ మార్కుల మెమో
➥ డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌
➥టెన్త్‌ మార్కుల మెమో
➥ ఇంటర్‌ మార్కుల మెమో
➥ డిప్లొమా మార్కుల మెమో
➥ స్టడీ సర్టిఫికేట్స్
➥ రెసిడెన్స్‌ సర్టిఫికేట్
➥ ఆదాయ ధ్రువపత్రం (ఇన్‌కమ్ సర్టిఫికేట్)
➥ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్) సర్టిఫికేట్
➥ లోకల్‌ స్టేటస్‌ సర్టిఫికేట్ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...