Inter Exam Fee Details: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశముంది. జనరల్, ఒకేషనల్ కోర్సుల థియరీ పరీక్షలు రాయదల్చినవారు రూ.550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఫీజు రూ.550తోపాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాలి. అదేవిధంగా బ్రిడ్జికోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రాక్టికల్స్‌ పరీక్ష ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరుకావాల్సినవారు ఈ మేరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌కు రూ.1,300, రీకౌంటింగ్‌కు రూ.260 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 


మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం  2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌లో ఫెయిల్ అయినా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు, విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తే ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.   


మే 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు..
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనుండగా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. మే 1 నుంచి 4 వరకు సంబంధిత జిల్లా కేంద్రాల్లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 


రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ద్వారా మరోసారి మార్కుల మూల్యాంకనం, రీవెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రాల స్కానింగ్ కాపీలు, జవాబుపత్రాల వెరిఫికేషన్ కోరవచ్చు.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు (AP Inter Results) సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 


ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..