ఏపీలో డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఈసెట్ (ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు) ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలను నమోదుచేసి ర్యాంకు కార్డులను పొందవచ్చు. 



AP ECET 2022 Rank Cards

జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్-2022 ఫలితాలను ఆగస్టు 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 92.42 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షకు 36,418 మంది హాజరు కాగా.. వీరిలో 33,657మంది అర్హత పొందారు. 

AP ECET Result 2022



మొత్తం 14 బ్రాంచిలకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సిరామిక్, బీఎస్సీ గణితంలో సీట్ల కంటే దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పరీక్ష నిర్వహించలేదు. సిరమిక్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు అకడమిక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. 

డిగ్రీ ఫలితాలు వచ్చిన తర్వాత బీఎస్సీ గణితం అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. బయోటెక్నాలజీ కోర్సుకు ఒక్కరూ దరఖాస్తు చేయలేదు. దీంతో దీనికి పరీక్ష పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.  ప్రాథమిక కీపై 1,100 అభ్యంతరాలు రాగా.. వీటిలో ఏడింటిని పరిగణనలోకి తీసుకున్నారు. మూడు ప్రశ్నలకు పూర్తిగా అందరికీ మార్కులు ఇవ్వగా.. నాలుగు ప్రశ్నలకు రెండు ఐచ్ఛికాల్లో ఏది పెట్టినా మార్కులు ఇచ్చారు.

ఇష్టానుసారం యాజమాన్య సీట్ల కేటాయింపు కుదరదు..
బీటెక్‌లో కేటగిరీ-బీ యాజమాన్య కోటా సీట్లను ఇష్టానుసారంగా భర్తీ చేయొద్దని కళాశాలల యాజమాన్యాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి హెచ్చరించారు. కేటగిరి-బీలోని 30శాతంలో 15శాతం యాజమాన్య కోటాకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. 30శాతం సీట్ల భర్తీని పూర్తిగా యాజమాన్యానికి అప్పగించే అంశానికి సంబంధించిన దస్త్రానికి ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు.

ప్రైవేటు బ్రౌన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయాల్లో గతంలోని 70శాతం కన్వీనర్ కోటా యథావిధిగా ఉంటుందని, కొత్తగా పెట్టే కోర్సుల్లో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాకు ఇవ్వాల్సి ఉంటుందని హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కళాశాలను ప్రైవేటు వర్సిటీగా మార్పు చేసుకుంటే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ గా పిలుస్తారు. ఇప్పటికే ఉన్న కళాశాలలోని సీట్లలో 70శాతం కన్వీనర్ కోటా ఉంటుంది. విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రారంభించే కోర్సుల్లో 35శాతం సీట్లు కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తారు. వీటికి ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. 


AP ECET-2022 ఫలితాలు ఇలా చూసుకోండి..



  • ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx  వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • అక్కడ హోంపేజీలో కనిపించే 'AP ECET - 2022' టాబ్‌పై క్లిక్ చేయాలి.

  • క్లిక్ చేయగానే ఈసెట్-2022కు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. -https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx

  • అక్కడ పేజీలో కనిపించే AP ECET - 2022 Results/Rank Cards ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

  • ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  •  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..