AP Coaching Institutions Rules 2026:ఏపీలో 'కస్టడీ' కోచింగ్ సెంటర్లను కట్టడి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కోచింగ్ పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలుంటాయి.                    AP Coaching Institutions Rules 2026 పేరుతో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల 'ఇష్టారాజ్యానికి' అడ్డుకట్ట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత, ఫీజుల పారదర్శకతను మెరుగుపరిచే లక్ష్యంతో ఉన్నత విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను (GO Ms No. 9) విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది . Sukdeb Saha Vs State of Andhra Pradesh (2025) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగునంగా అనేక కొత్త నిబంధనలను జీవోలో పొందుపరిచారు.

Continues below advertisement

ఏపీ కోచింగ్ ఇనిస్టిట్యూషన్ రూల్స్:

  • రోజుకు గరిష్టంగా 5 గంటలు మాత్రమే కోచింగ్ ఇవ్వాలి. పాఠశాల, కళాశాల పనివేళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కోచింగ్ క్లాసులు నిర్వహించకూడదు.
  • ఆదివారాలు, ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడం నిషేధం.
  • ఏదైనా కారణంతో విద్యార్థి కోర్సు మధ్యలో వదిలేస్తే.. మిగిలిన కాలానికి సంబంధించిన ఫీజును  (Proreta basis)10 రోజుల్లోపు తిరిగి చెల్లించాలి. 'ఫీజు వెనక్కి ఇవ్వబడదు' అనే నిబంధనలు ఇకపై చెల్లవు.
  • ఫీజుల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ వద్ద ఉంచుకోవడం చట్టవిరుద్ధం.
  • విద్యార్థుల మార్కులు , ర్యాంకులను బహిరంగంగా హోర్డింగ్స్‌పై, వెబ్‌సైట్లలో గానీ ప్రదర్శించకూడదు. ఫలితాలను వ్యక్తిగతంగా తల్లిదండ్రులకు మాత్రమే తెలపాలి.
  • 50 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

గీత దాటితే వేటే:

Continues below advertisement

నిబంధనలు రూపొందించడం మాత్రమే కాకుండా వాటి పర్యవేక్షకు కమిటీలు కూడా వేశారు. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 'జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ' (DLMC) ఏర్పాటవుతుంది.దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.మొదటిసారి ఉల్లంఘిస్తే 50,000 జరిమానా, రెండవసారి అదే తప్పు చేస్తే..1,00,000 జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కూడా అలాగే జరిగితే కోచింగ్ సెంటర్ అనుమతి రద్దు అవుతుంది. పునరావృతమైతే  కోచింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దు చేిసి శాశ్వతంగా మూత వేస్తారు. 

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యంప్రతి కోచింగ్ సెంటర్ తప్పనిసరిగా ఒక 'వెల్‌నెస్ సెల్' (Wellness Cell) ఏర్పాటు చేయాలి. ఇందులో శిక్షణ పొందిన కౌన్సెలర్లు ఉండాలి. విద్యార్థులు చేరిన 30 రోజుల్లోపు వారి మానసిక స్థితిని అంచనా వేసి, అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఆత్మహత్యల నివారణకు హాస్టళ్లలో 'యాంటీ-సూసైడ్' స్ప్రింగ్ ఫ్యాన్ల ఏర్పాటును కూడా ప్రభుత్వం సూచించింది.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి చెక్ముఖ్యంగా రాష్ట్రంలో ర్యాంకుల రేస్, అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ రూల్స్ తెచ్చారు. NEET (మెడికల్), JEE (ఇంజనీరింగ్), UPSC/APPSC, బ్యాంకింగ్ & క్లాట్ (CLAT) వంటి పోటీ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ర్యాంకుల గోలలో కోచింగ్ సెంటర్లు విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పోరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ విద్యార్థులను బందీలుగా మారుస్తున్నాయి. రోజుకు 18గంటల పాటు కోచింగ్ పేరుతో వాళ్లని వేధిస్తున్నాయి. 

ఏమిటీ కేసు..?

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన కారణంగానే ఇప్పుడు ఈ రూల్స్ వచ్చాయి. విశాఖలో NEET కోచింగ్ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించిన ఘటనతో ఈ కేసు ప్రారంభమైంది. కుటుంబం CBI విచారణ కోరగా… సుప్రీంకోర్టు కేసును సీరియస్‌గా తీసుకుంది.. Sukdeb Saha Vs State of Andhra Pradesh (2025) అనే ఈ కేసుతో కోచింగ్ సెంటర్ల పనితీరుపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తాయి.  సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయాలని సూచించింది. దీంతో కోచింగ్ సెంటర్లకు షాక్ ఇచ్చేలా కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది:

  •  టాప్-బాటమ్ బ్యాచ్‌లుగా విభజించడం వద్దు పబ్లిక్‌గా విద్యార్థులను అవమానించడం నిషేధం ఒత్తిడికి మించిన టార్గెట్స్ ఇవ్వకూడదు ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో కౌన్సిలింగ్ తప్పనిసరి హాస్టళ్లలో హెల్ప్‌లైన్ నంబర్లు డిస్‌ప్లే చేయాలి టీచర్లకు మెంటల్ హెల్త్ ట్రైనింగ్ కంపల్సరీ రూఫ్‌టాప్, బాల్కనీలు వంటి హై రిస్క్ ఏరియాలకు యాక్సెస్ కంట్రోల్ వంటి ఆదేశాలిచ్చింది. 

దానికి అనుగునంగా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రూల్స్ విధించింది.