ఏపీ 2022 పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఆగస్టు 3న విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన  సంగతి తెలిసిందే. 


AP S.S.C EXAMINATION , JULY - 2022 RESULTS


64.23 శాతం ఉత్తీర్ణత..
ఈ ఏడాది పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెండు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలురు 1,09,413 మంది, బాలికలు 82,433 మంది ఉన్నారు.  ఫలితాల్లో 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1,91,896 మంది పరీక్షలు రాయగా 1,31,233 మంది పరీక్ష  ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 60 శాతం పైగా ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 68  శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక అత్యల్పంగా పశ్చిమగోదావరి  జిల్లాలో  46.66  శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.


Also Read: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌


రెగ్యులర్ విద్యార్థులతో సమానంగానే..
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనున్నారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్‌ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తుండేవారు. కానీ ఈ సారి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని కూడా రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనున్నారు. 

గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు.. ఈ ఏడాది జరిగిన పరీక్షలు ప్రభుత్వానికి నిరాశను మిగిలింది. అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ముందు అలాంటి తప్పులను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. 


Read Also: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!

మార్కుల రూపంలో..
పదోతరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 6,22,537 మంది హాజరుకాగా 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. 67.26 శాతం మాత్రమే ఉతీర్ణత నమోదైంది. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 6 నుంచి 15 వరకు  పదో తరగతి సప్లిమెంటరీ నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. జూన్ 6న ఫలితాలను విడుదల చేశారు. నెలరోజుల్లోపే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా, ఆంధ్రాలో ఈసారి పదోతరగతి ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..