TS EAPCET 2024 Toppers: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్ భాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన స‌తివాడ జ్యోతిరాధిత్య టాప్ ర్యాంకులో నిలవగా.. కర్నూలు జిల్లాకు చెందిన గొల్లలేఖ హ‌ర్ష రెండో ర్యాంకులో నిలిచాడు. ఇక కర్నూలుకు చెందిన ముర‌సాని సాయి య‌శ్వంత్ రెడ్డి 5వ ర్యాంకు, అనంత‌పురానికి చెందిన పుట్టి కుశాల్ కుమార్ 6వ ర్యాంకు, విజ‌య‌న‌గ‌రానికి చెందిన ధ‌నుకొండ శ్రీనిధి 10వ ర్యాంకుతో సత్తాచాటారు. మొత్తంగా చూస్తే ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10లో 5 ర్యాంకులు ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.


ఇక అగ్రికల్చర్, ఫార్మా విభాగంలోనూ మొదటి రెండు ర్యాంకు ఏపీ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. అన్నమ‌య్య జిల్లాకు చెందిన ఆలూరు ప్రణీత 1వ ర్యాంకు, విజ‌య‌న‌గ‌రానికి చెందిన న‌గుదశారి రాధాకృష్ణ 2వ ర్యాంకు, చిత్తూరు జిల్లాకు చెందిన సోమ్‌ప‌ల్లి సాకేత్ రాఘ‌వ్ 4వ ర్యాంకు, తిరుప‌తికి చెందిన వ‌డ్లపూడి ముఖేశ్ చౌద‌రి 7వ ర్యాంకు, శ్రీ స‌త్యసాయి జిల్లాకు చెందిన పూల దివ్య తేజ 10వ ర్యాంకు సాధించింది. మొత్తంగా చూస్తే ఈ విభాగంలో టాప్-10లో 5 ర్యాంకులు ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.


TS EAPCET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


TS EAPCET - 2024 టాపర్ల వివరాలు కోసం క్లిక్ చేయండి..


టాపర్లు బాలురే.. అయినా?
ఎప్‌సెట్ ఫలితాల్లో టాపర్లు బాలురే అయినప్పటికీ.. బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. అయితే టాప్-10లో ఒకే అమ్మాయి 10 ర్యాంకులో నిలిచింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 90.18 శాతం, బాలురు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 75.85 శాతం, బాలురు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ ప‌రీక్షల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారు. ఇక ఎంసెట్‌ ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే రావడం విశేషం.


గతేడాదిలో పోలీస్తే స్వల్పంగా తగ్గిన ఉత్తీర్ణత...
తెలంగాణ ఎప్‌సెట్-2024 ఫలితాల్లో మొత్తంగా 82.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఇంజినీరింగ్ ఉత్తీర్ణత శాతం తగ్గగా.. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 80.33 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. ఈసారి 74.98 శాతానికి పరిమితమైంది. ఇక అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో మాత్రం గతేడాది 86 శాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణత నమోదుకాగా.. ఈసారి 89.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే గతేడాది ఫలితాల్లో 83.16 శాతం ఉత్తీర్ణత శాతం నమోదుకాగా.. ఈసారి 82.32 శాతానికి పరిమితమైంది.


ర్యాంకు కార్డులు అందుబాటులో..
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన TSEAPCET -2024 పరీక్ష ఫలితాలు మే 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులను కూడా అందుబాటులో ఉంచారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఎప్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు వారంరోజుల్లో విడుదల చేయనున్నారు. 


ఎప్‌సెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..