APEAPCET 2024 Web Counselling Schedule: ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 1న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 7 వరకు నిర్ణీత ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.


రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి  జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇది పూర్తయినవారు జులై 8 నుంచి 12 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు జులై 13న అవకాశం కల్పించనున్నారు. అనంతరం జులై 16న అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 17 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్) విభాగాలకు సంబంధించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడనుంది. 


కౌన్సెలింగ్ షెడ్యూలు..


➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 01.07.2024 - 07.07.2024.


➥సర్టిఫికేట్ వెరిఫికేషన్: 04.07.2024 -10.07.2024.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 08.07.2024 - 12.07.2024.


➥ వెబ్‌ఆప్షన్ల మార్పు: 13.07.2024.


➥ సీట్ల కేటాయింపు: 16.07.2024.


➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్, రిపోర్టింగ్: 17.07.2024 to 22.07.2024.


➥ తరగతులు ప్రారంభం: 19.07.2024.


Counselling Notification


Counselling Website


కౌన్సెలింగ్ సమయంలో అవసరమైన సర్టిఫికేట్లు..
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వెబ్‌కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినటల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ సర్టిఫికేట్లు అవసరం..


➥ APEAPCET-2024 ర్యాంకు కార్డు


➥ APEAPCET-2024 హాల్‌టికెట్


➥ ఇంటర్ లేదా తత్సమాన మార్కుల మెమో 


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో 


➥ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ) 


➥ 6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు 


➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 


➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ 


ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది. 


ఈ ఏడాది మే 16 నుంచి 23 వరకు ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జేఎన్‌టీయూ- కాకినాడ పరీక్ష నిర్వహించింది.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.


జూన్ 11న ఏపీ ఎప్‌సెట్ ఫలితాలను వెల్లడించారు. మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది.  తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు.




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..