APSRTC Bus :  శంషాబాద్ నుంచి రాజోలు వెళ్తోన్న ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ ప్రయాణికుడు హల్ చల్ చేశాడు. తోటి ప్రయాణికులపై కారం చల్లి దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లాడు. అయితే అతడి పాస్‌పోర్టు సరిగా లేనికారణంగా అధికారులు అతడ్ని తిరిగి పంపేశాడు. స్వగ్రామం తిరిగి వెళ్లేందుకు రాంబాబు ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎక్కాడు. ఆర్టీసీ బస్సు పాలకొల్లు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ప్రయాణికులపై కారం చల్లాడు. ఈ పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. కారం చల్లడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రయాణికులు యువకుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు రాంబాబుని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టు అధికారులు పాస్‌పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని నిరాశలో యువకుడు తోటి ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు నిర్థారించారు. 


దుబాయ్ చిక్కుకున్న సిరిసిల్ల యువకులు 


రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకొని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగ్లోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దొళ్ల స్వామి, అదే జిల్లాకు చెందిన గొల్లపెళ్లి రాములు, అనిల్ అలాగే  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన నరేందర్ లు మూడ్రోజుల నుంచి దుబాయ్ విమానాశ్రయంలో నరకం అనుభవిస్తున్నారు. 


ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటేనే


దుబాయ్ లోని ఓ కంపెనీ.. సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇచ్చారు. అయితే ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఐదుగురు యువకులకు కంపెనీ షాక్ ఇచ్చింది. ఏజెంట్లు చెప్పిన పని, జీతం వేరడవంతో కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేం ఈ పని చేయలేమంటూ గొడవ పడ్డారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులను పిలిపించి తాగొచ్చి గొడవ చేస్తున్నారని కేసు బుక్ చేయించారు. ఈ క్రమంలోనే కంపెనీ నిర్వాహకులు ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకుంటే ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. దీంతో బాధితులు ఇండియా నుంచి టికెట్లు తెప్పించుకున్నారు.  


 కేసులున్నాయని వెనక్కి 


బాధితుల పాస్ పోర్టులు ఇచ్చేసి వాళ్లను ఎయిర్ పోర్టు వద్ద వదిలేశారు. అయితే శనివారం రోజు రాత్రి వాళ్లు ఇండియాకు రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐదుగురు యువకులు పాస్ పోర్టులు, టికెట్లు తీసుకొని ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లారు. ఐదుగురికి విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ అక్కడి పోలీసులు వాళ్ల పాస్ పోర్టులు చెక్ చేసి.. మీ పైన కేసులు ఉన్నాయి, మీరు ఇండియాకి వెళ్లరాదని చెప్పి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించారు. ఏం చేయాలో పాలుపోని యువకు ఇటు ఏజెంట్లు అటు కంపెనీ నిర్వాహకులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎయిర్ పోర్టు వద్దనే  కూర్చొని యువకులు తమ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు వారికి ఏమవుతుందో ఏమోనని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరిని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.