Warangal News: తమ అవసరాలకు డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి ఇంట్లోనే చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను సీసీఎస్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు మూడు లక్షల ఆరవై వేల రూపాయల విలువగల 65 గ్రాముల బంగారు అభరణాలతోపాటు అర కిలో వెండి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


వివరాలు వెల్లడించిన సీపీ.. 


ఈ అరెస్ట్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన ఉరుగొండ శ్రీకాంత్ (35), కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన దేవుల పల్లి రవీందర్ (40), కుడికాల్ల సురేష్ (36)లు స్నేహితులు. అయితే వీరిలో శ్రీకాంత్ సెల్‌ఫోన్ కంపెనీలో కలెక్షన్ బాయ్‌గా పని చేస్తుండగా, మిగితా ఇద్దరు నిందితులు స్థానికంగా ఉండే ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తున్నారు. అయితే శ్రీకాంత్, రవీందర్ బావమరదులు కాగా.. సురేష్ వీరికి స్నేహితుడు. అయితే ప్రతిరోజూ పని అయిపోయిన వెంటనే ముగ్గురూ కలిసి మద్యం సేవించడం, జల్సా చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానంద కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న బాధితుడితో పరిచయం పెంచుకున్నారు. 


మద్యం సేవించేందుకు అప్పులు..


తాము పని చేసే డబ్బులు తాగేందుకే సరిపోకపోవడంతో అప్పులు చేయడం ప్రారంభించారు. దయానంద కాలనీకి చెందిన ఓ వ్యక్తి నుంచి తరచుగా అప్పులు తీసుకోవడం, అతనితో ఆయన ఇంట్లోనే కలిసి మద్యం సేవించడం అలవాటుగా మార్చుకున్నారు. ఇదే క్రమంలో బాధితుడు బీరువాలోంచి డబ్బులు తీసి ఇస్తుండగా వాళ్లు కూడా తలుపు బయట నుంచి చూశారు. బీరువాలో ఉన్న బంగారంతో పాటు వెండి వస్తువులపై వారి కన్ను పడింది. ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలనుకున్నారు. ఇందుకోసం ఓ పథకం వేశారు. బాధితుడికి పూటుగా మద్యం తాగించి ఇంట్లో దింపే నెపంతో అతడి ఇంట్లోకి వచ్చి ఆ వస్తువులను కాజేయాలనుకున్నారు. ప్లాన్ ప్రకారమే దఫాల వారిగా ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులతో పాటు డబ్బును చోరీ చేశారు. ఒకేసారి మొత్తం తీసుకెళ్తే అనుమానం వస్తుందని ఇలా దొంగతనం చేశారు. 




అయితే విషయం గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు డీసీపీ పుష్ప ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. ఒక్కరోజులోనే నిందితులను గుర్తించారు. అయితే చోరీ చేసిన సొత్తును నిందితులు ఈ రోజు ఉదయం వరంగల్ బిలియన్ మార్కెట్ లో అమ్మేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన సీసీఎస్ మరియు మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కల్సి వెళ్లి నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  65 గ్రాముల బంగారు అభరణాలతో పాటు అర కిలో వెండి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను గట్టిగా ఇంటరాగేట్ చేయడంతో చోరీ చేసింది తామే అని ఒప్పుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.