వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో తీవ్రమైన విషాదం నెలకొంది. కన్న తండ్రి తన కన్న కూతుర్లకు ఏకంగా విషం ఇచ్చిన ఘటన కలకలం రేపింది. వీరిలో పెద్ద కుమార్తె చనిపోగా, చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారు జానకిపురం గ్రామానికి చెందిన గుండె శ్రీను - ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ధనలక్ష్మి కొద్ది రోజుల క్రితం ఊరికి వెళ్లింది. కుటుంబ కలహాలతో కన్న తండ్రి తల్లి లేని సమయంలో చిన్నారులకు ఇద్దరికీ కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. 


ఇద్దరు బాలికలు పడిపోవడం గమనించిన స్థానికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు కూతుర్లను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. మధ్యలో ఉండగానే పెద్ద కూతురు ప్రియ (10) సంవత్సరాలు మృతి చెందింది. చిన్న కూతురు నందిని (7) పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తరలించారు.


ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామానికి చెందిన గుండె శ్రీనుతో దద్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మికి పదేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి ముగ్గురు పిల్లలు నాగప్రియ (9), నందిని (5), రక్షిత్ తేజ్ (4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను వీధిస్తూనే ఉన్నాడు. విసిగిపోయిన ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లింది.


భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపాలనుకున్నాడు. ఈ నెల 6న కూల్ డ్రింక్ లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని పిల్లలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించగా చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.