Warangal Crime : కొబ్బరి బొండాల మాటున గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఉప సర్పంచ్ సహా నలుగురిని  టాస్క్ ఫోర్స్,  ఆత్మకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 లక్షల రూపాయల విలువైన 170 కిలోల గంజాయి, ఒక కారు, గంజాయి రవాణాకు వినియోగించిన బోలెరో వాహనం, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో  రాయినేని శంకర్, ముసిక లక్ష్మణ్, మాట మహేష్, గండికోట సతీష్ ఉన్నారు.


అసలేం జరిగింది? 


ఈ అరెస్ట్ కు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ పి.కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ... నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉప సర్పంచ్ ముసిక లక్ష్మణ్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగం నిందితులు మిగితా ఇద్దరు నిందితులతో కలిసి ఏపీలోని నర్సీపట్నంలోని నూకరాజు ద్వారా 170 కిలోల గంజాయిని కోనుగోలు చేసి దానిని రెండు కిలోల ప్యాకేట్ల చొప్పున బోలేరో వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరి బొండాల మధ్యలో రహస్యంగా భద్రపర్చి వరంగల్ కు తరలించారు. ఈ గంజాయిని వరంగల్ తరలించే క్రమంలో ప్రధాన నిందితులు శంకర్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరో కారులో గంజాయికి తరలిస్తున్న కారుకు ఎస్కాట్ గా వ్యవహరించేవారు. పోలీసులకు అందిన సమాచారంతో టాస్క్ఫోర్స్, ఆత్మకూర్ పోలీసులు.. ఆత్మకూర్ గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహించిన తనీఖీల్లో అనుమానస్పదంగా వస్తున్న నిందితులు వాహనాలను అదుపులోకి తీసుకోని తనిఖీ చేశారు. బోలేరో వాహనంలో కొబ్బరి బొండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.



వైజాగ్ టూ బెంగుళూరు గంజాయి అక్రమ రవాణా 


చిత్తూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీతో  గంజాయి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నా  స్మగ్లర్లు పోలీసుల కన్ను కప్పి గంజాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. తాజాగా వైజాగ్ నుంచి బెంగుళూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని పది లక్షల రూపాయలు విలువ చేసే 96 కేజీల గంజాయిని, ఒక కారుని సీజ్ చేశారు. 


పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి. పలమనేరు పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం‌తో‌ బంగారుపాళ్యం ‌మండలం, ఎన్ హెచ్-69 జాతీయ రహదారిలోని మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు చేపట్టగా, పోలీసులను చూసి ఓ కారు వస్తున్న కొందరు పరార్ అయ్యేందుకు ప్రయత్నం చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు  ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, నర్సీపట్నం నుంచి బెంగుళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయలు విలువ చేసే 96 కేజీల గంజాయిని, ఒక హొండా‌సిటి కారును సీజ్ చేశారు. నిందితులు కర్ణాటకకు చెందిన శంభూ అనే స్మగ్లర్, తమిళనాడుకు చెందిన రమేష్ అనే వ్యక్తిలు వైజాక్ సమీపంలోని నర్సీపట్నం నుంచి గంజాయిని విక్రయించి కర్ణాటకకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. అంతే కాకుండా పట్టుబడిన అబ్దుల్ జలీల్, మురళీధరన్, అభిలాష్ లు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రధాన ముద్దాయిలు శంభు, రమేష్ ల‌ కోసం గాలిస్తున్నామని, శంభు, రమేష్ లను పట్టుకుని గంజాయిని నర్సీపట్నంలో ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారే విషయం తెలుస్తుందన్నారు. గతంలోనే శంభు, రమేష్‌లపై తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీసు స్టేషన్ లల్లో‌ కేసు నమోదు అయినట్లు తెలిసిందని పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలియజేశారు.