Warangal News : నిరుద్యోగులకు ఊద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులకు వసూళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మాజీ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను వరంగల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక ఖరీదైన కారుతో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ... భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం అన్ సాన్ పల్లికి చెందిన బానోత్ రాజ్ కుమార్ (35) గతంలో సెంట్రల్ ఇండ్రస్టీ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ గా కొంత కాలం పనిచేశాడు. అనంతరం విధులకు గైర్హజరు కావడంతో నిందితుడుని అధికారులు విధుల నుంచి తొలగించారు. రాజ్ కుమార్ స్థానిక భూపాల్ పల్లి పట్టణంలో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం తనకు ఆర్.టి.ఏ, విద్యుత్తు, పోలీస్, కలెక్టరేట్, ఎటీపీసీ, ఆర్టీసీతో పాటు కేయూసీ విశ్వవిద్యాలయంలో తనకు ఉన్నతస్థాయి అధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుని ఆయా విభాగాల్లో జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజ్ కుమార్ ప్రచారం చేసుకున్నాడు.  



20 మంది దగ్గర రూ.57 లక్షల వసూలు 


రాజ్ కుమార్ మాటలు నమ్మిన బాధితుల నుంచి సుమారు మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు డబ్బులు వసూళు చేశాడు. కొంత మందికి ఏకంగా పలు విభాగాల్లో జూనియర్ క్లర్క్ గా నకిలీ నియామక పత్రాలను సైతం అందజేసి వారిని బురిడి కొట్టించాడు. నకిలీ నియామక పత్రాలకు అందుకుని సదరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన బాధితులకు అవి నకిలీ నియామక పత్రాలని తెలియడంతో ఖంగుతిన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. టాస్క్ ఫోర్స్ ఇంఛార్జ్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అదేశాల మేరకు రంగంలో దిగి టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టి నిందితుడుని అరెస్టు చేశారు. నిందితుడు 20 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు నుంచి సుమారు 57 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై హన్మకొండ, ఇంతేజార్ గంజ్, సుబేదారితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయినట్లుగా పోలీసుల తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడుని కాజీపేట పోలీసులకు అప్పగించారు. 


టాస్క్ ఫోర్స్ కు కమిషనర్ అభినందనలు


నిందితుడు రాజ్ కుమార్ ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన టాస్క్ ఫోర్స్ ఇంఛార్జ్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాజ్, సంతోష్, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ ప్రేమానందమ్, ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీకాంత్, సృజన్,లియాకత్ ఆలీ, మహేందర్, శ్రవణ్ కుమార్, శ్రీనుతో పాటు సైబర్ క్రైం కానిస్టేబుల్ కిషోర్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.