Vizag News: విధులు సక్రమంగా నిర్వర్తించి.. దేశానికి సేవ చేయాల్సిన వ్యక్తి. కానీ అడ్డదారులు తొక్కాడు. అక్రమంగా డబ్బులు సంపాదించాలని కొలువునొదిలి ఇళ్లకు కన్నాలేయడం మొదలు పెట్టాడు. ఏకంగా 12 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ కేసు వివరాలను డీఎస్పీ గోవిందరావు వెళ్లడించారు.


వైజాగ్‌కు చెందిన కె.శ్రీనివాసరావు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. సెలవుపై గతేడాది ఆగస్టులో వచ్చేశాడు. ఉడాకాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలోనే ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. రూ.లక్షల్లో అప్పుల పాలయ్యాడు. దీంతో ఉద్యోగానికి వెళ్లలేదు. అప్పులు తీర్చేందుకు దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గ సామగ్రి కొన్నాడు. తాళాలు వేసి ఉన్న గృహాలే లక్ష్యంగా.. పగటి వేళ రెక్కీ నిర్వహించేవాడు. రాత్రి 9 గంటల సమయంలో బయలుదేరి.. 12 గంటలయ్యే సరికి దోచేసేవాడు. ఇప్పటి వరకు 12 చోట్ల నేరాలకు పాల్పడ్డాడు. ఉడాకాలనీ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3, అలకానంద కాలనీ, రింగురోడ్డు, బాబామెట్ట తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి అపహరించాడు. 




ఇలా దొరికేశాడు..!


వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈనెల 14న ఉడా కాలనీ సమీపంలోని ఆర్టీసీ కాలనీలో బి.శ్యామ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం శాలిపేట వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, శ్రీనివాసరావు ఓ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పట్టుకుని తనిఖీ చేయగా.. అందులో కొన్ని తాళాలు, స్క్రూ డ్రైవర్‌ తదితర పరికరాలు ఉన్నాయి. వాటిపై ఆరా తీయగా నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు. నిందితుడి నుంచి 27 తులాల బంగారం, ఆరు కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  కేసును ఛేదించిన ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు, ఎస్సై వి.అశోక్‌ కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాస్‌, బి.శివ, బి.శంకర రావు, ఎన్‌.గౌరీ శంకర్‌ను ఆయన అభినందించారు. 


ఒకే రోజులో 20 ఇళ్లలో దొంగతనాలు


కర్ణాటక హుబ్లీకి చెందిన దార్ల నెహమయ్య అలియాస్‌ మెహమయ్య అలియాస్‌ బ్రూస్‌లీ, అదే రాష్ట్రం సేడం అనే ప్రాంతానికి చెందిన మందుల శంకర్‌ ఇద్దరూ స్నేహితులు. కూలీ పనులు చేసుకొని బతికేవారు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారు. వీరు పనుల కోసం వివిధ నగరాలు తిరుగుతూ ఉంటారు. మొదట మురికి వాడలు ఉన్న ప్రాంతాల ఆచూకీ తెలుసుకుని, అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుంటారు. నెల రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో రెక్కీ చేసి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. మద్యం తాగి లేదా గంజాయి పీల్చి ఇక తాము ఎంచుకున్న ప్రదేశాలకు దొంగతనాలకు బయలుదేరతారు. స్ర్కూ డైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌లు వీరి ఆయుధాలు. తాళాలు తెరిచి ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి లాంటి ఖరీదైన వస్తువులు తీసుకొని ఉడాయిస్తారు.


ఇలా వీరు కొంతకాలంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో 53 దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఒకే రోజులో హైదరాబాద్ లో కూకట్‌పల్లిలో 9, ఎల్‌బీ నగర్‌లో 7 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మరికొన్ని నేరాలు కూడా చేశారు. వీటిపై బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేకంగా దృష్టి సారించిన సీపీ సీవీ ఆనంద్‌ (Hyderabad CP CV Anand) సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. డీసీపీ రాధాకిషన్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌, ఘరానా దొంగలు సనత్‌ నగర్‌ పరిధిలోని ఫతేనగర్‌ ప్రాంతం మురికివాడలో ఉంటున్నట్లుగా గుర్తించారు.