Vizag Crime News: విశాఖలో ఓ యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్ చేసిన దుర్ఘటన జిల్లాను షేక్ చేస్తోంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


మిస్సింగ్‌ కేసు మిస్టరీ


విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. తన కుమార్తె కనిపించడం లేదంటూ ఓ తండ్రి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఆమె పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని ట్రేస్‌ అవుట్ చేశారు. 


యువతి ఆచూకీతో వెలుగులోకి వచ్చిన కేసు 


వెంటనే పోలీసులు వెళ్లి యువతి ఆచూకి కనుగొన్నారు. ఆమెను తీసుకొచ్చి విచారించిన పోలీసలకు చెమటలు పట్టాయి. వైజాగ్‌ సిటీలో ఇలాంటి దారుణం ఒకటి జరిగిందని ఆమె చెప్తే తప్ప తెలుసుకోలేకపోయారు. ఆమె చెప్పిన విషయాలు అచ్చం సినిమా స్టోరీ లెక్క ఉన్నాయి. 


ప్రేమ పేరుతో మోసం 
ఆ యువతి ఓ యువకుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ మరింత ముదిరింది. ఇద్దరూ ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. ఇద్దరూ శారీరకంగా కలిశారు. అక్కడే ప్రియుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఆ రూమ్‌కి తన స్నేహితుడిని పిలిచాడు. అతనితో కూడా ఆమెపై బలవంతం చేయించాడు. 


షాక్‌తో బీచ్‌కు వెళ్లిన యువతి


ప్రేమించిన యువకుడు ఇలా చేసే సరికి ఆమెకు ఏం చేయాలో అర్థంకాలేదు. ఆషాక్‌లో నుంచి రాలేకపోయింది. హోటల్ గదిలో నుంచి అలా సముద్రతీరానికి చేరుకుంది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. అక్కడే ఓ వ్యక్తి ఆమె పరిస్థితిని గమనించాడు. ఆ వ్యక్తి బీచ్‌కు వచ్చే సందర్శకుల ఫొటోలు తీస్తుంటాడు. 


ఓదార్పు పేరుతో మోసం 


ఫొటోలు తీసే ఆ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు నాలుగు మంచి మాటలు చెప్పాడు. అప్పటికే తీవ్ర మనోవేదనతో ఉన్న ఆ యువతి అతని మాటలు కూడా నమ్మేసింది. ఆమెను ఓదార్చిన యువకుడు తన రూమ్‌ అని చెప్పి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. 
అప్పటికే ప్రియుడు ఇచ్చిన షాక్‌లో ఉన్న యువతికి అక్కడ మరో షాక్ తగిలింది. బీచ్‌లో పరిచయం అయిన వ్యక్తి కూడా తనపై అత్యాచారం చేశాడు. ఆమెను బెదిరించి కొట్టి హింసించి ఏడుగురితో పాడుపని చేయించాడు. ఒకటి కాదు రెండు రోజులపాటు ఆమెను బంధించి చిత్రవధ చేశారు. 


భయంతో పరార్‌


చివరకు అక్కడి నుంచి ఏదోలా బయటపడిందా యువతి. అక్కడి నుంచి తనకు తెలియకుండానే ఎటో వెళ్లిపోయింది. ఇంట్లో వాళ్లు వెతుకుతున్నారన్న ధ్యాస లేకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో తండ్రి మిస్సింగ్ ఫిర్యాదు ఇవ్వడంతో ఆమె ఆచూకి తెలిసింది. 
తనకు జరిగిన దారుణాన్ని పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును డీసీపీ శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. నాలుగో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.