Visakhapatnam Suitcase Murder Case Suresh: విశాఖపట్నం నగరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసిందనే ఏకైక కక్షతో, ఒక యువతిని దారుణంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం దుర్గానగర్ ప్రాంతానికి చెందిన బొలిశెట్టి సురేష్ అనే ఆటో డ్రైవర్ చేసిన ఈ ఘాతకం, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా పక్కా స్కెచ్ ప్రకారం సాగింది.

Continues below advertisement

బాధితురాలు సంధ్యతో సురేష్‌కు కొంతకాలంగా పరిచయం ఉండగా, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, గత కొన్ని రోజులుగా పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తను చెప్పినట్లు వినడం లేదనే కోపంతో, పక్కా పథకం ప్రకారం ఆమెను కడతేర్చాలని సురేష్ నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఆమెపై దాడి చేసి అత్యంత క్రూరంగా హత్య చేసిన అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఓ పెద్ద ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి సీల్ చేశాడు.

హత్య చేసినంత సులభంగా ఆధారాలు దాచలేమని గ్రహించిన నిందితుడు.. మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను ఎవరికీ దొరక్కుండా దూర ప్రాంతానికి తరలించాలని ప్లాన్ వేశాడు. విశాఖలోని జ్ఞానాపురం రైల్వే స్టేషన్‌కు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లి, అక్కడ నుంచి ఒడిశా వైపు వెళ్లే రైలులో వేసి రాయగడకు చేరుకున్నాడు. రాయగడ సమీపంలోని ఖాలిగుడా వద్ద ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్‌ను పడేసి, ఏమీ తెలియనట్లు మళ్లీ విశాఖకు చేరుకుని ఎప్పట్లాగే ఆటో నడుపుకోవడం ప్రారంభించాడు.                   

Continues below advertisement

అయితే, ఖాలిగుడా వద్ద దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గుర్తించి ఒడిశా పోలీసులకు సమాచారం అందించారు. సూట్‌కేస్ తెరిచి చూసిన పోలీసులకు మృతదేహం లభించడంతో వెంటనే విచారణ వేగవంతం చేశారు. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు సీసీటీవీ దృశ్యాలు, సైబర్ సెల్ సహాయంతో సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్స్ ,  డేటాను విశ్లేషించాయి. హత్య జరిగిన రోజున జ్ఞానాపురం స్టేషన్ నుంచి రాయగడ వరకు బాధితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన ప్రదేశాలు, సురేష్ మూవ్‌మెంట్స్‌ను సాంకేతికంగా మ్యాపింగ్ చేయడంతో నిందితుడి గుట్టు రట్టయింది.                             

పోలీస్ వాహనాలకు ఆప్టింగ్ డ్రైవర్‌గా కూడా పనిచేస్తూ పోలీసుల కదలికలపై అవగాహన ఉన్న సురేష్.. సాంకేతిక ఆధారాల ముందు చివరకు దొరికిపోయాడు. ఒడిశా పోలీసు బృందం కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేష్‌ను విశాఖలో అదుపులోకి తీసుకుంది. పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ తరహాలో సాగిన ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.