Visakha Crime : తొమ్మిదేళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడి చేసిన కేసులో 73 ఏళ్ల వృద్ధుడికి తాజాగా వైజాగ్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మొబైల్ గేమ్‌లతో ఆకర్షించి తన ఇంటికి తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూడమని బలవంతం చేసి లైంగికదాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు నెలల పాటు ఆమెపై లైంగికదాడి చేసి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు నిందితుడు. బాలిక తన తల్లితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు. లైంగికదాడి చేసిన వ్యక్తి కూడా అదే ప్రాంతంలోనే ఉన్నాడు. 


20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 


మార్చి 23, 2022న చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ దారుణమైన నేరం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తన తల్లికి మొత్తం జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు నిందితుడు కోలాటి బాలయోగిపై ఐపీసీ సెక్షన్ 376, 354 (ఎ), 506, పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ నేతృత్వంలో దిశ పోలీసులు విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయమూర్తి కె.రామ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పునిచ్చారని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్ణీత గడువులోగా నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్ దాఖలు చేయడంలో నగర పోలీసులు కృషిచేశారని తెలిపారు. బాధితురాలికి న్యాయం చేసిన పోలీసు బృందాన్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే కృష్ణను నగర పోలీస్‌ చీఫ్‌ శ్రీకాంత్‌ అభినందించారు. 


కడపలో దారుణం 


బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపవరం మండలం రాచాయపేటకు చెందిన ఓ బాలికపై కొందరు బాలురు లైంగిక దాడికి పాల్పడగా.. ఈ ఘటన ఇటీవల ఆలస్యంగా బయటకు వచ్చింది. దాదాపు మూడు నెలల క్రితం ఓ బాలిక నేరేడుపండ్ల కోసం కొండ ప్రాంతానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఉన్న నలుగురు బాలురు ఆమెను లైంగికంగా వేధించారు. అంతా కలిసి ఆ బాలికపై అత్యాచారం చేశారు. వారి అమానుష చర్యను ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే ఇదంతా జరిగినా.. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. కానీ కొన్ని రోజుల క్రితం బాలికను బాలురు బలవంతం చేస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోగా అవి కాస్త ఒకరి నుండి మరొకరికి షేర్ అయ్యాయి. 


మూడు నెలల కింద ఘటన, ఇప్పుడు వెలుగులోకి


దీంతో, బాలిక తల్లిదండ్రులు వారిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు నలుగురు మైనర్లపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కడపలోని జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. అలాంటి ఫోటోలను కానీ వీడియోలను కానీ ఎవరైనా గుర్తిస్తే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదా తమ ఫోన్ నంబర్ నుండి 94407 96900 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.