Man Suicide: విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదాపక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి సోమేశ్వరరావు ఈనెల 8వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. రంగంలోకి దిగారు. మృదేహానికి నివాళులు అర్పించడానికి మృతుడి గ్రామానికి పయనమయ్యారు. ఆయనతో పాటు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడల్ పీలా శ్రీనివాస రావు, టీడీపీ నాయకులు ఉన్నారు. అయితే అప్పటికే గోవిందపురంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలు, పక్క గ్రామాల ప్రజలు వస్తున్న విషయం తెలుసుకుని వెళ్లి మార్గ మధ్యంలోనే వారిని అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని లేకుంటే అరెస్టులు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా టీడీపీ నాయకులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు.


భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారు !  
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైకాపా నాయకుల ప్రోద్భలంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు ఓ భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారని.. అది భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని బండారు సత్య నారాయణ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నేతలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, స్థానిక ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. అయితే సోమేశ్వర రావు చావుకు కారణం అయిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి బండారు సత్యనారయణ ఆరోపించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఏసీపీ మోహన్ రావుకు ఫిర్యాదు కాపీని అందజేశారు. 


అంత్యక్రియలకు సమయం మించిపోతుంది.. ఇప్పటికైనా సహకరించండంటూ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళనను విరమించారు. అయినప్పటికీ రంగంలోకి దిగిన డీసీపీ సుమిత్ సునీల్ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ నేతల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయకులను పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి సింహాచలంలో వదిలి పెట్టారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం సోమేశ్వర రావు అంత్యక్రియలు సజావుగా సాగేలా చూసేందుకు పోలీసులు గోవిందపురానికి వెళ్లారు.  


రెంట్ చెల్లించలేదని పీహెచ్ సీకి తాళం.. 
కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ లో ఇంటి బాడుగ చెల్లించలేదంటూ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇంటి యజమాని తాళం తాళం వేశారు. పట్టణంలోని నాగలకట్ట వీధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇంటి యజమాని తాళం వేశారు. దీనితో ఆరోగ్య కేంద్ర సిబ్బంది రోడ్డుపైనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదు నెలల నుంచి ఇంటికి రెంటు చెల్లించక పోగా, కరెంటు బిల్లులు కూడా కట్టడం లేదని తెలిపారు. గత కొంత కాలంగా ఈ విషయాన్ని వైద్యాధికారులకు చెబుతున్నా.. వారు సరిగ్గా స్పందించడం లేదన్నారు. అందుకే పీహెచ్ సీకి తాళం వేసినట్లు వివరించారు. 


ప్రభుత్వం సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక నడిరోడ్డుపైనే రోగులకు చికిత్స అందజేస్తుమన్నారు. సరైన సమయంలో నిధులు ఇవ్వడమో లేదంటే.. పీహెచ్ సీని నిర్మించడమైనా చేయాలని వైద్యులు కోరుతున్నారు.