BMW Car Cash Theft:


బెంగళూరులో చోరీ..


బెంగళూరులో పార్కింగ్‌ చేసి ఉన్న BMW కార్‌లో (Bengaluru Crime News) నుంచి ఓ దొంగ రూ.14 లక్షలు చోరీ చేశాడు. డోర్ విండో గ్లాస్‌ పగలగొట్టి చాలా తెలివిగా అందులో నుంచి క్యాష్‌బ్యాగ్‌ని లాగేశాడు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ఇద్దరు దొంగలు కలిసి ఈ చోరీని ప్లాన్ చేశారు. ఓ వ్యక్తి క్యాష్‌బ్యాగ్‌ని కొట్టేయగా..మరో వ్యక్తి బైక్‌ స్టార్ట్‌ చేసి రెడీగా ఉన్నాడు. డబ్బు చేతికి అందగానే వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఎవరి కంటాపడకుండా జారుకున్నప్పటికీ అక్కడి సీసీ కెమెరాలు మాత్రం ఇదంతా రికార్డ్ చేశాయి. కార్‌ అద్దం పగిలి ఉండడమే కాకుండా లోపల క్యాష్ కనిపించకపోవడం వల్ల వెంటనే కార్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ చోరీకి సంబంధించిన విజువల్స్‌ని గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పైన వచ్చారు. ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకున్నారు. పార్క్ చేసి ఉన్న BMW కార్‌ వద్దకి ఓ వ్యక్తి వెళ్లాడు. అటూ ఇటూ చూసి జేబులో నుంచి ఓ టూల్ తీశాడు. ఆ టూల్‌తో గ్లాస్‌ పగలగొట్టాడు. అదే కిటికీలో నుంచి కార్‌లోపలికి దూరాడు. క్యాష్ బ్యాగ్‌ చేతికి చిక్కగానే వెంటనే బయటకు వచ్చేశాడు. మరో వ్యక్తి బైక్‌పై ఎదురు చూస్తున్నాడు. బ్యాగ్‌ని చోరీ చేసిన వ్యక్తి వేగంగా వచ్చి  బైక్ ఎక్కాడు. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 


 






దిల్‌ రాజు అల్లుడి కార్ చోరీ..


ప్రముఖ నిర్మాత అల్లుడికి చెందిన రూ.కోటిన్నరకుపైగా విలువైన పోర్షే కారును ఓ వ్యక్తి చోరీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్‌ పోలీసులు గంటలోనే కారు జాడను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7కోట్ల విలువైన తన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ కారును హోటల్‌ వద్ద నిలిపి లోపలికి వెళ్లారు. అంతుకుముందే మల్లెల సాయికిరణ్ అనే యువకుడు స్కూటీపై హోటల్ పార్కింగ్ స్థలం వద్దకు వచ్చాడు. ఖరీదైన కార్లకోసం వెతికాడు. ఈ సమయంలోనే అర్చిత్ రెడ్డి పోర్షే కారులో రావడంతో సాయికిరణ్ కళ్లు ఆ కారుపై పడ్డాయి. అర్చిత్ రెడ్డి లోపలికి వెళ్లిన తరువాత కారు దగ్గరకు వెళ్లిన కిరణ్ కారును చాకచక్యంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. 40 నిమిషాల తరువాత తిరిగి వచ్చిన అర్చిత్‌రెడ్డి కారు కోసం చూడగా కనిపించలేదు. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. రూ.1.7 కోట్లు విలువ చేసే తన కారు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని రంగంలోకి దించి సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్‌ జంప్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్‌ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. కారును నిలువరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Also Read: నాలుగేళ్ల కూతుర్ని కత్తితో పొడిచి చంపిన తల్లి, కొడుకుపైనా హత్యాయత్నం