Vijayawada Crime An Woman brutally kills woman in Vijayawada
విజయవాడ: కొన్ని సందర్భాలలో కుటుంబ వివాదాలు దాడుల వరకు వెళ్లగా, కొన్నిసార్లు హత్య చేసేందుకు కూడా వెనుకాడరు. తాజాగా ఏపీలో అలాంటి దారుణం జరిగింది. చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను నరికి చంపిన తరువాత దుండగుడు పరారయ్యాడు. విజయవాడలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది.


చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళ హత్య
పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ శివారులోని చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళను ఆమె అల్లుడు దారుణంగా హత మార్చాడు. జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణికి ఆమె రెండో అల్లుడు రాజేశ్ కి మధ్య విభేదాలు వచ్చాయి. ఆమె రెండో కూతురి భర్త, అత్త నాగమణిపై కక్ష పెంచుకున్నాడు. భార్యను కాపురానికి పంపించలేదని, సమస్యను పరిష్కరించుకుందామని మాట్లాడాలని పిలిచాడు రాజేశ్. కుమార్తెను తీసుకుని తల్లిదండ్రులు నగర శివారులోని ఫ్లై ఓవర్ వద్దకు వచ్చారు. 


ప్లాన్ ప్రకారం హత్య..
ఫ్లై ఓవర్ వద్దకు అత్తామామలు రాగానే నిందితుడు రాజేశ్ ఆవేశంతో ఊగిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో మొదట బైకుపై ఉన్న మామను నరికేందుకు యత్నించాడు. తప్పించుకున్న మామ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆపై అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు రాజేశ్. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన నాగమణి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. కూతురు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న నాగమణి డెడ్ బాడీని జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేశ్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial