Uppal Murder Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీ కొడుకుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్థిరాస్తి తగాదాల్లోనే తండ్రీ కొడుకులను ప్రత్యర్థులు హత్య చేశారని మొదట భావించిన పోలీసులు.. విచారణ అనంతరం, ఆధారాల సేకరణ తర్వాత క్షుద్రపూజల కోణం బయటకు వచ్చింది. హత్య జరిగిన చోటుకు సమీపంలోని పసుపు, కుంకుమ ప్యాకెట్లు దొరకడంతో క్షుద్రపూజలు వికటించడం వల్లే వారు హత్యకు గురైనట్లు రాచకొండ పోలీసులు తేల్చారు. 


క్షుద్రపూజల నేపథ్యంలోనే హత్య


ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయి నగర్ కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ, ఆయన కుమారుడు నర్సింహుల శ్రీనివాస్ లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. నర్సింహ శర్మ క్షుద్ర పూజలు, వాస్తు పూజలు చేసే వారని, ఈ వ్యవహారంలోనే నిందితులు ఆయనపై కక్షగట్టారని పోలీసుల ప్రాథమిక విచారణలో నర్సింహ శర్మ పని మనిషి, స్థానికులు చెప్పినట్లు సమాచారం. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా.. హత్య చేసిన అనంతరం నిందితులు వైజాగ్ కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. మామిడిపల్లికి చెందిన వినాయక్ రెడ్డి, అతని మిత్రుడు సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణ రెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 


తీవ్రంగా నష్టపోవడంతోనే హత్య!


నర్సింహుల నర్సింహ శర్మ క్షుద్ర పూజలు చేస్తుండే వారు. అలా ఆ పూజల నేపథ్యంలో నర్సింహ శర్మకు, వినాయక్ రెడ్డికి పరిచం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. నర్సింహ శర్మ చెప్పిన అన్ని పూజలు చేసిన వినాయక్ రెడ్డి.. ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోయానని, దానికి నర్సింహ శర్మనే కారణమని అతడిని చంపాలని భావించినట్లు సమాచారం. తన స్నేహితుడు బాలకృష్ణారెడ్డితో కలిసి హత్యకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 


నర్సింహ శర్మ ఏ టైముకు ఎక్కడికి వెళ్తున్నాడు.. అతని దినచర్య ఏమిటి అని తెలుసుకునేందుకు నర్సింహ శర్మ ఇంటి ఎదురుగ ఉన్న హాస్టల్ లో దిగారు. వారం రోజుల పాటు నర్సింహ శర్మ కదలికలను పసిగట్టారు. పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. శుక్రవారం ఉదయం బ్యాగులో కత్తులు తీసుకువచ్చారు. నర్సింహ శర్మ ఇంట్లోకి చొరబడి, ఆయన గొంతు కోసి చంపారు. తండ్రిని చంపి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని అడ్డగించేందుకు నర్సింహ శర్మ కుమారుడు శ్రీనివాస్ ప్రయత్నించగా.. అతడిపైనా వారు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. శ్రీనివాస్ మృతదేహంపై 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి అయింది. 


పనిచేయని సీసీటీవీ కెమెరాలు


నర్సింహ శర్మ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కానీ అవి కొన్ని రోజులుగా పని చేయడం లేదు. ఆ సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదన్న విషయం నర్సింహ శర్మకు, ఆయన కుమారుడు శ్రీనివాస్ కు తెలియదు. సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు హత్య చేసినా అవేవీ అందులో రికార్డు కాలేదు. అదే ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటిన పోలీసులు పరిశీలించారు. కానీ ఎందులోనూ నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. దీంతో వారి సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అలా వారిని అరెస్టు చేసి హత్యకు గల కారణాలను బహిర్గతం చేశారు.