Lover kills woman he met on Instagram:   ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 52 ఏళ్ల మహిళను ఆమె 26 ఏళ్ల ప్రియుడు అరుణ్ రాజ్‌పుత్ గొంతు ఊపి హత్య చేశాడు. ఫరూఖాబాద్‌కు చెందిన రాణి అనే ఈ మహిళ, అరుణ్‌ను వివాహం చేసుకోవాలని, తానిచ్చిన రూ. 1.5 లక్షల రుణాన్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఈ హత్య జరిగినట్లు  పోలీసులు ప్రకటించారు.           

ఇన్‌స్టాలో తక్కువ వయసు అని చెప్పి యువకుడ్ని ప్రేమించిన 52 ఏళ్ల మహిళ       

రాణి, అరుణ్ రాజ్‌పుత్‌లు సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. రాణి తన వయసును దాచడానికి ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్లను ఉపయోగించి, తాను చిన్నవయసు మహిళగా కనిపించేలా చేసుకునేది. వీరి ఆన్‌లైన్ సంభాషణలు క్రమంగా సంబంధంగా మారాయి. రెండు నెలల క్రితం వీరు ఫరుఖాబాద్‌లోని ఒక హోటల్‌లో మొదటిసారి కలుసుకున్నారు. అయితే, రాణి నిజ రూపం, వయసు 52 ఏళ్లు అని గుర్తించిన  అరుణ్ షాక్‌కు గురయ్యాడు. అయినా సంబంధం కొనసాగించాడు. నలుగురు పిల్లల తల్లి అయిన రాణి, అరుణ్‌కు రూ. 1.5 లక్షలు రుణంగా ఇచ్చింది.             

లక్షన్నర అప్పు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని వేధింపులు             

ఈ రుణాన్ని ఆసరాగా చేసుకుని రాణి, అరుణ్‌ను వివాహం చేసుకోవాలని, రుణం తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఈ ఒత్తిడి సహించలేని అరుణ్, ఆగస్టు 10న రాణిని మైన్‌పురిలోని ఒక నిర్జన ప్రాంతానికి పిలిచాడు. అక్కడ మరోసారి వివాహం, రుణం గురించి వాదన జరిగింది. కోపంతో రాణి ధరించిన దుప్పట్టాతో ఆమెను గొంతు ఊపి హత్య చేసి, ఆమె ఫోన్‌లోని సిమ్‌కార్డ్ తొలగించి శవాన్ని పొదల్లో పడేసి పరారయ్యాడు.  గుర్తు తెలియని మహిళ శవం గురించి పోలీసులకు సమాచారం రావడంతో దర్యాప్తు చేశారు.  పోలీసులు ఫొటోలను సమీప జిల్లాల్లో పంపిణీ చేశారు.  రాణి కుటుంబం ఆగస్టు 30న ఆమె మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో, ఫొటోల ద్వారా ఆమె గుర్తింపు నిర్ధారణ అయింది. 

హత్య చేసిన యువకుడు                

కాల్ రికార్డులు, సోషల్ మీడియా ఇంటరాక్షన్‌ల ఆధారంగా అరుణ్ రాజ్‌పుత్‌ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. అతని నుంచి రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అరుణ్ రాజ్‌పుత్ నేరాన్ని అంగీకరించాడు. రాణి తన కుటుంబానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే భయంతో ఆమెను హత్య చేసినట్లు వెల్లడించాడు. రాణితో జరిగిన చాట్‌లు, ఫొటోలు ఉన్న ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు, ఆన్‌లైన్ సంబంధాలలోని ప్రమాదాలను మరోసారి బయటపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ల ద్వారా వయసును దాచడం, అతిగా నమ్మకం పెట్టుకోవడం వంటి అంశాలు ఈ హత్యకు దారితీశాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.