Kamareddy Bus Car Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మాచారెడ్డి (Machareddy) మండలం ఘన్‌పూర్‌(ఎం) గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న (TSRTC Bus - Car colloids) ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. 


ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారు నెంబరును పరిశీలించి మృతులంతా నిజామాబాద్‌ జిల్లా కమ్మర్ పల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.