Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదక ద్రవ్యాల దందాను సినీ భాషలో కోడ్ వర్డ్స్ గా వాడుకుంటున్నట్లు పోలీసులు తేల్చారు. మరోపక్క టీఎస్ నాబ్ అధికారులు సినీ నటుడు నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ను పరిశీలిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ తో లింకులు ఉన్న డ్రగ్స్ కేసులు రెండు నమోదు అయ్యాయి. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్ ఠాణాలో నమోదు అయింది. అలాగే వెంకట రమణారెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్ కమిషనరేట్ లోని గుడి మల్కాపూర్ ఠాణాలో రిజిస్టర్ అయింది. ఈ కేసులో హీరో నవదీప్ పేరు బయట పడింది. 


డ్రగ్స్ అంటే స్క్రిప్టు, పెడ్లర్ అంటే రైటర్, కావాలంటే షల్ వీ మీట్


ఈ రెండు కేసుల్లోనే అనేక మంది నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడల్స్ సైతం డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్లు బయటపడింది. వీళ్లు రహస్య ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారమంగా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికీ వాళ్లు కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈక్రమంలోనే సినీ రంగానికి చెందిన వారు సినీ కోడ్ లోనే మాట్లాడుకుంటూ క్రయవిక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా డ్రగ్ కు స్క్రిప్టు అని, పెడ్లర్ కు రైటర్ అని, డ్రగ్స్ కావాలని అడగడానికి షల్ వీ మీట్ అని కోడ్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సినీరంగానికి సంబంధించిన వారి ఫోన్లను పరిశీలించినప్పుడు ఈ పదాలే ఎక్కువగా కనిపించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. 


అలాగే మరోవైపు నవదీప్ నుంచి పోలీసులు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్ ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్ క్రయవిక్రయాలన్నీ స్నాప్ చాట్ ఆధారంగా జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ సామాజిక మాధ్యమాల యాప్ లో ఉన్న డిజ్ అప్పీర్ ఆప్షన్ ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుడిమల్కాపూర్ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్న వ్యాపారి కలహర్ రెడ్డి, పబ్ నిర్వాహకుడు సూర్య కాంత్ సహా మరో వ్యక్తి మంగళ వారం రోజు దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. గుడి మల్కాపూర్ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు అవుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. తనకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు. తర్వాత కూడా సహకరిస్తానని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని అన్నారు.