Tirupati Crime News: తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఏర్పేడు మండలం చెన్నంపల్లిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అయితే నిందితులు దొరకకుండా ఉండేందుకు పేడతో మృతదేహాన్ని కడిగేశారు. ఈక్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడి బంధువులు ఆరోపిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 


మృతుడు మోహన్ బాబు తన ఇంట్లో ఉండగా... మునిరెడ్డి అనే ఓ వ్యక్తి వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లాడు. పాపా నాయుడు పేటలోని ద్రౌపది తిరుణాలకు వెళ్తామని చెప్పి వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మునిరెడ్డి అదే రోజు రాత్రి తిరిగి వచ్చి మోహన్ బాబు కూతర్లకు మీ నాన్న చనిపోయాడని చెప్పాడు. వాళ్లను ఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న వాళ్ల నాన్నను చూసిన కూతుర్లు ఇద్దరూ తీవ్రంగా భయపడిపోయారు. వెంటనే వారి బంధువులకు ఫోన్ చేసి తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు... మునిరెడ్డిని నిలదీశారు. నీవే బయటకు తీసుకెళ్లావు, నీవే హత్య చేసి ఉంటావని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బంధువులందరూ.. పోలీసులకు ఫోన్ చేశారు. వారు కూడా రంగంలోకి దిగగా.. మునిరెడ్డిపైనే తమకు అనుమానంగా ఉందని వివరించారు. 


అతనే ఇంటి నుంచి తీసుకెళ్లాడని.. అతనే చంపేసి, ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పేడతో కడిగేసి ఉంటారని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న పోలీసులు మునిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వడమాల పేట మండలం కల్లూరులో నివాసం ఉంటున్న ముళ్ళపూడి మోహన్ బాబు (45) మల్లాడి డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. గత సంవత్సరం ఇతడి భార్య స్వర్ణముఖి నదిలో కొట్టుకుని పోయి మరణించింది. ప్రస్తుతం అతను కూడా చనిపోవడంతో అతని ఇద్దరు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.