మనస్సుకు నచ్చిన‌ వారు ఎదురైతే జీవితాంతం వారితోనే జీవితాన్ని పంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. అయితే ప్రేమించుకున్న వారంతా వివాహాల వరకూ వెళ్ళరు. అలాగని ప్రేమించి‌ పెద్దలను ఒప్పించి‌ పెళ్ళి చేసుకున్న వాళ్ళంతా ప్రేమగా ఉండలేరు అన్న దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా 13 ఏళ్ళుగా ప్రేమించి జీవితాంతం ఆమెతో కలిసి‌ ఉండాలన్న ఎన్నో కలలు కన్న ఓ యువకుడి‌ ఆశలు నెరవేరక పోవడంతో చివరికి ఆత్మహత్య పాల్పడి ప్రాణాలను‌ సైతం వదిలాడు. అసలు ఏం జరిగిందంటే!


తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, రెడ్డివారిపల్లెకు‌ చెందిన‌ చిన్నంగారి‌ మురళీ మోహన్‌ ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఐతే అదే గ్రామానికి చెందిన అత్త కుమార్తెను గత 13 ఏళ్లుగా ప్రేమించాడు.. ఇరువురు పెళ్ళి చేసుకోవాలని‌ పలుమార్లు ‌ప్రయత్నించినా పెద్దలు అడ్డుకోవడంతో వీరి వివాహ ప్రయత్నాలు పెళ్లి వరకూ వెళ్లలేదు. మురళీ ‌మోహన్ అనేక సార్లు ప్రియురాలి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసినా అందుకు వారు అంగీకరించలేదు.. దీంతో గతంలో ఓసారి మురళీ మోహన్ పురుగుల‌ మందును‌ సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. 


సరైన సమయంలో కుటుంబ సభ్యులు చూసి మురళీ మోహన్‌ను ఆసుపత్రికి ‌తరలించడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. అటు తర్వాత మురళీ మోహన్ తల్లిదండ్రులు యువతి తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏ మాత్రం ‌పట్టించుకోలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సైతం జరిగాయి. ఈ క్రమంలో యువతికి మరో యువకుడితో ఎవరికి తెలియకుండా పెళ్ళి చేయాలని భావించారు. మురళీ మోహన్ ను పెళ్ళి చేసుకుంటే తాము అంతా చనిపోతామని కుటుంబ సభ్యులు బెదిరించడంతో వేరే మార్గం లేక యువతి మరొకరితో వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంది. 


ఈ క్రమంలోనే‌ యువతి కుటుంబ సభ్యులు గురువారం తెల్లవారుజామున వివాహం జరిపించారు. ఐతే తన ప్రియురాలికి మరొకరితో పెళ్ళి జరిగిందన్న వార్త తెలుసుకున్న మురళీ మోహన్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని‌ ప్రాణాలను వదిలాడు. ఇంట్లో విగతజీవిలా ఫ్యాన్ కు వేలాడుతున్న కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి‌పర్యాంతం అయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.