Old City Murder: ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవ వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి పేర షాకీర్ గా పోలీసులు గుర్తించారు. అతడు భవాని నగర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. 


వ్యక్తి హత్య కేసులో స్నేహితులపై అనుమానం


భవాని నగర్ ప్రాంతంలో నివాసం ఉండే 30 ఏళ్ల షాకీర్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి స్నేహితుల మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకున్న షాకీర్ స్నేహితులు అతడిపై కక్ష పెట్టుకున్నారు. ఈ క్రమంలో షాకీర్ టాటా ఏస్ వాహనంలో బ్యాటరీల లోడ్ తో సంతోష్ నగర్ నుండి బండ్ల గూడ వైపు వెళ్తుండగా అతడిని ముగ్గురు వ్యక్తులు వెంబడించారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఎల్ రోడ్డు వరకు రాగానే అతడిని వారు అడ్డగించారు. షాకీర్ కళ్లలో కారం చల్లారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న కత్తులో షాకీర్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ముగ్గురు వ్యక్తుల దాడిలో షాకీర్ గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. షాకీర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఏవైనా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయా అనే ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం షాకీర్ తో గొడవ పడ్డ స్నేహితులే షాకీర్ ను అడ్డగించి హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఘటనే కొత్తగూడెంలో జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు తన స్నేహితుడిని సిమెంట్ ఇటుక, రాడ్డుతో తీవ్రంగా కొట్టి చంపాడు. గాజులరాజం బస్తీకి చెందిన బడికెల సందీప్ అదే ప్రాంతానికి చెందిన పల్లం సాయికుమార్ మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి బడ్డీ కొట్టు వద్దకు వెళ్లి అక్కడ సిగరెట్ తాగారు. తర్వాత అక్కడి సందీప్ వెళ్లిపోతుండగా.. డబ్బులు ఇవ్వు అంటూ బడ్డీ కొట్టు రాకేశ్ అడిగాడు. తర్వాత ఇస్తాలే అంటూ సందీప్ సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉందని రాకేశ్ అడగడంతో పక్కనే ఉన్న సాయి కుమార్ ఎందుకు రా డబ్బులు ఇచ్చేసేయ్ అన్నాడు. ఈ విషయంలో వారి మధ్య వాదన జరిగింది. నువ్వేంట్రా నాకు చెప్పేది అంటూ సందీప్ అతడి స్నేహితుడు సాయి కూమార్ ను కొట్టాడు. తర్వాత సాయి కుమార్ కూడా చేయి చేసుకున్నాడు. అలా వారిద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. అదే క్రమంలో సాయి కుమార్ సందీప్ పై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో సందీప్ కింద పడిపోగా.. అక్కడ పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో సందీప్ తలపై సాయికుమార్ బలంగా కొట్టాడు. మంచి చెబితే తననే కొట్టాడన్న ఆవేశంలో సందీప్ రక్తపు మడుగులో ఉన్నా కనికరం లేకుండా మరోసారి ఇటుకతో బలంగా కొట్టాడు. సాయికుమార్ దాడిలో సందీప్ చెవి, ముక్కుల్లోంచి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు.