Severe Road Accident In Palnadu District: పల్నాడు జిల్లాలో (Palnadu District) గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం - గుంటూరు జాతీయ రహదారిపై వినుకొండ (Vinukonda) సమీపంలోని కొత్తపాలెం వద్ద ఓ ఇన్నోవా కారు అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన సోమసి బాలగంగాధర్ శర్మ (78), ఆయన సతీమణి యశోద (67), కారు డ్రైవర్‌గా గుర్తించారు. గంగాధర్ శర్మ టీటీడీ విశ్రాంత ఉద్యోగి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


ఈ ప్రమాదంలో గంగాధర్ శర్మ కుమారుడు హెచ్‌ఎస్‌వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య, వీరి పిల్లలు కార్తిక్, అనుపమ తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో శర్మ, అనుపమ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Gas Cylinder Leakage: గ్యాస్ సిలిండర్‌ లీక్ అయితే వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఇల్లు పేలిపోతుంది