Tirupati Murder Crime :   రోడ్డు మధ్యలో ఇద్దరు గొడవ పడుతూంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. కల్పించుకోరు. ఎందుకంటే తిరిగి తమను తంతారేమోననేది జనం భయం. వీళ్ల భయం అర్థం చేసుకోకుండా... "మానవత్వం".. "మనషులు మాయమయ్యారు" లాంటి పెద్ద పెద్ద మాటలతో దాడి చేసేస్తూంటారు. అలా గొడవ మధ్యలో ఆపడానికి వెళ్లి చనిపోయిన వారి గురించి.. దెబ్బలు తిని ఆస్పత్రిలో చేరిన వారి గురించి చాలా సార్లు విన్నాం.. కానీ తిరుపతిలో జరిగిన ఓ మర్డర్ మాత్రం భిన్నం. గొడవలోకి యాధృచ్చికంగా వెళ్లిన ఓ యువకుడు చివరికి మర్డర్ చేయాల్సి వచ్చింది. 


తిరుపతి సమీపంలోని మంగళం బిటిఆర్ కాలనీకి చేందిన కన్నయ్య అదే ప్రాంతానికి చేందిన ఓ యువతిని ప్రేమించాడు.. అమ్మాయి ఇంట్లో విషయం తెలుసుకున్న పెద్దలు అమ్మాయిని మందలించి, తమ కుమార్తె జోలికి రావద్దని కన్నయ్యకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే ఎలాగైన తాను‌ ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకోవాలని భావించిన కన్నయ్య యువతిని ఈ నెల 15 తారీఖున పెళ్ళి చేసుకునేందుకు తీసుకెళ్ళాడు. అయితే  ప్రేమికులను పట్టుకున్న పూతలపట్టు పోలీసులు గుర్తించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురు తల్లిదండ్రులకు పిలిచి పంపారు. ఆ ఎపిసోడ్ అంతటితో ముగిసింది. 


శుక్రవారం రాత్రి  రాత్రి కన్నయ్య తన స్నేహితులైన చందు,ప్రవీణ్ లతో కలిసి తిరుమలనగర్ కు వెళ్ళే మార్గంలో ఉన్న చికెన్ దుకాణం వద్దకు వచ్చారు.  అదే సమయానికి అక్కడకు  యువతి‌ బావ కిరణ్, అతని స్నేహితులు గిరి,మహేష్, లక్ష్మీ నారాయణ రాజులు వచ్చారు.  మళ్లీ యువతిని తీసుకెళ్లడానికి వచ్చారేమో అనుకున్న వారు కన్నయ్యతో గొడవ పడ్డారు. గ్యాంగ్ వార్‌లాగా కొట్టుకునే ప్రయత్నంలో తమకు అందుబాటులో ఉన్న ఎగ్ ట్రేలతో దాడి చేసుకున్నారు. అప్పటి వరకూ మనకెందుకుకే అని ఓపిక పట్టి చూస్తున్న చికెన్ షాప్ యజమాని సతీష్.. పక్కకెళ్లి కొట్టుకోండని అరిచాడు. అలా అన్నందుకు యువతి తరపు బంధువుల్లో ఒకరైన లక్ష్మినారాయణ రాజు   చికెన్ కొట్టే కత్తిని ఎత్తుకుని యజమానిపై దాడి చేసేందుకు  ప్రయత్నించాడు.


దీంతో చికెన్ కొట్టు యజమాని తన ప్రాణం కాపాడుకునందుకు  లక్ష్మీ నారాయణ రాజు చేతిలోని కత్తిన తీసుకుని లక్ష్మీ నారాయణ రాజు మెడపై నరికాడు. అసలే చికెన్ కొట్టు.. నరకడంలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. గురి తప్పలేదు. లక్ష్మినారాయణ రాజు స్పాట్‌లోనే చనిపోయాడు.  స్ధానికుల సమాచారం మేరకు ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సతీష్ ను అదుపులోకి తీసుకుని, గొడవ పడిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.


ఆ ప్రేమ గొడవతో అసలు ఆ చికెన్ కొట్టు యజమానికి సంబంధమే లేదు. కానీ చివరికి హత్య కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది.