మాములుగా రాజకీయాల్లోకి సినిమావాళ్లు రావడం మాములే. ఆ స్టార్‌డమ్‌తోనే పాలిటిక్స్‌లో రాణిస్తుంటారు. అలా సినీస్టార్‌ గా వచ్చిన ఆవిడ మంత్రి అయ్యారు. పొలిటిషన్‌గా వచ్చిన ఆవిడ ఇప్పుడు పదవి పోయాక యాక్టర్‌ అయ్యారు. 


ఏపీ సిఎం జగన్‌ కేబినెట్‌లో నిన్నటి వరకు పుష్పశ్రీవాణి డిప్యూటీ సిఎంగా ఉన్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆవిడని ఈ దఫా పక్కన పెట్టారు. దీంతో పుష్ప శ్రీవాణి ఈ మధ్య అంతగా యాక్టివ్‌గా లేరు. ఏంటబ్బా మేడమ్‌ ఎక్కడున్నారు అనుకుంటున్న టైమ్‌లో వెండితెరపై సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. 
 
పుష్పశ్రీవాణి నటించిన అమృతభూమి సినిమా ఈనెల 22న విడుదలైంది. కోరుకొండ బ్రహ్మానందం దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రకృతి వ్యవసాయం గురించి తీసింది. ఇందులో కీలకపాత్రలో పుష్పశ్రీవాణి నటించారు. ఆమె నియోజకవర్గంలో ఎక్కువ భాగం షూటింగ్‌ జరుపుకుందీ చిత్రం. అంతేకాదు ఈ సినిమాలో అప్పటి విజయనగరంజిల్లా కలెక్టర్‌ కూడా నటించారు. 


ఏపీలోని కొన్ని థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి రాష్ట్రప్రభుత్వం కూడా సహకారం అందించింది. నిన్నటివరకు డిప్యూటీ సిఎంగా రాజకీయాల్లో చక్రం తిప్పిన పుష్పశ్రీవాణి ఇప్పుడు యాక్టర్‌గా తెరపై కనిపించడంతో అభిమానులు కూడా షాకయ్యారట. అసలు టిక్‌టాక్‌ షోలతోనే శ్రీవాణి ఫేమస్‌ అయ్యారు. యాక్టింగ్‌ అంటే భలే ఇంట్రస్ట్‌ అట. అందుకే సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. 


ఇంకోవైపు రోజా హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్‌ వెంట ఈ చెల్లెమ్మే కనిపిస్తున్నారు. నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇప్పుడు పర్యాటక మంత్రి అవ్వడంతో ఆ శాఖకి స్టార్‌ డమ్‌ వచ్చేసిందంటున్నారు అభిమానులు. వెండితెరపై హీరోయిన్‌గా, బుల్లితెరపై యాంకర్‌గా వెలిగిన రోజా ఇప్పుడు ఆ ప్రపంచాన్ని వదిలేశారు. పూర్తిగా రాజకీయాలకే టైమ్‌ కేటాయించారు. అందుకు కారణం పాలిటిక్స్‌లోనూ స్టార్‌డమ్‌ని అందుకోవాలనే లక్ష్యమట. అన్నయ్య జగన్‌ ఇచ్చిన మంత్రి పదవిని సమర్థంగా నిర్వహించి... వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు అందుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అంతేనా జగన్‌ అన్నయ్య గుండెల్లో నిలిచిపోయే వ్యక్తిగా నిలవాలనుకుంటున్నారు. మళ్లీ జగనే సిఎంను చేసి మంత్రి దక్కించకుంటానన్న ధీమాతో రాజకీయాల్లో స్పీడు పెంచారట. 


ఇలా ఓకే పార్టీలోని ఇద్దరు మహిళలు ఒకరు వెండితెర నుంచి రాజకీయాల్లోకి వస్తే.. మరో లీడర్‌ రాజకీయాల నుంచి వెండితెరపై కనిపించి షాక్ ఇచ్చారు. వైసీపీలో చాలామందే సినీ ఇండస్ట్రీ జనాలు ఉన్నారు. అయితే వాళ్లంతా రాజకీయాల్లో ఉంటే పుష్పశ్రీవాణి లాంటి వాళ్లు పాలిటిక్స్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చి యాక్టర్లుగా మారడం ఆశ్చర్యం కలిగించింది.