Texas Shooting:


టెక్సాస్‌లో కాల్పులు 


అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో ఐదుగురిని కాల్చి చంపేశాడు. మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఫ్రాన్సిస్కో ఒరోపెజా పై ఇప్పటికే మర్డర్ కేసులున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎప్పటి నుంచో పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. అయితే టెక్సాస్‌లోని క్లీవ్‌లాండ్‌లో ఓ ఇంట్లో దాక్కున్న నిందితుడు ఉన్నట్టుండి బయటకు వచ్చి గన్‌ ఫైరింగ్ మొదలు పెట్టాడు. పక్కింటి వాళ్లు ఈ ఫైరింగ్‌ సౌండ్ విని భయపడిపోయారు. వెంటనే బయటకు వచ్చి ఫైరింగ్ ఆపాలని చెప్పారు. ఇంట్లో చిన్నపాప నిద్రపోతోందని, భయపడుతోందని వార్నింగ్ ఇచ్చారు. కానీ....ఆ నిందితుడు అందుకు ఒప్పుకోలేదు. పైగా నా ఇంట్లోకి ఎందుకొచ్చావ్ అంటూ బెదిరించాడు. ఆ తరవాత ఉన్నట్టుండి వాళ్లపై కాల్పులు జరిపాడు.  AR-15 గన్‌తో ఫైరింగ్ మొదలు పెట్టాడు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 8 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెప్పారు. "నా ఇష్టమొచ్చినట్టు చేసుకుంటా" అంటూ గన్‌ ఫైరింగ్ చేశాడు. కాల్పులు జరిపిన తరవాత పరారయ్యాడు. 


తెలుగు  వ్యక్తి మృతి..


అమెరికాలో ఇటీవల కూడా కాల్పులు జరిగాయి. దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడు ఒకరు దుర్మరణం చెందాడు. వెస్ట్‌ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 లకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి వీర సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్‌, 1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌ పని చేస్తున్న వీర.. దోపిడీకి ప్రయత్నించిన దొంగను అడ్డుకున్నాడు. దాంతో రెచ్చిపోయిన దుండగులు, సాయిష్ వీరపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, కాల్పులకు తెగబడిన అనుమానితుడి ఫోటోలను కొలంబస్‌ పోలీసులు విడుదల చేశారు. ఈ సంవత్సరం కొలంబస్‌లో ఇది 50వ హత్య కావడం గమనార్హం. 24 ఏళ్ళ సాయిష్ వీర మరో రెండు వారాల్లో ఉద్యోగం మానేయాలని అకున్నాడు. కానీ, ఇంతలోనే ఈ అనుకోని ఘటన జరగడం.. అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాయిష్ వీర కొలంబస్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. H1 - B వీసా కూడా తీసుకున్నాడు. అందరికి అడగ్గానే హెల్ప్ చేసే వాడనీ.. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆ తరవాత అమెరికాలోని టెన్నిస్సే రాష్ట్రంలోని నాష్ విల్ లోని ఓ మిషనరీ పాఠశాలలో  జరిగిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోప్లోయారు. అయితే పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడింది 28 ఏళ్ల నిందితుడు ఆడ్రే హలే గా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి లింగమార్పిడి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హలేని ఆమె అని సంభోదిస్తుండగా.. లింక్డిన్ ప్రొఫైల్ మాత్రం పురుషుడిగా చూపిస్తోంది. ఇది ఆకస్మికంగా జరిగిన షూటింగ్ కాదని పోలీసులు వెల్లడించారు.