Telugu Young Man Died In Firing In America: అమెరికాలో వివిధ కారణాలతో తెలుగు విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఓ తెలుగు యువకుడు అక్కడ కాల్పుల్లో మృతి చెందడం కలకలం రేపింది. బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆమెరికా ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ పని చేస్తున్నాడు. జీవనోపాధి కోసం 8 నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు మార్కెట్‌లోకి నేరుగా వచ్చి గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు. అనంతరం ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తీవ్ర గాయాలైన యువకున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో మృతుని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Also Read: Karate Kalyani: గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న కరాటే కల్యాణి - లారీ ముందు కూర్చొని నిరసన