MIM Akbaruddin Owaisi : పదేళ్ల క్రితం నిర్మల్‌, నిజామాబాద్‌ పర్యటనలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ హేట్ స్పీచ్ పై కేసులో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు తాజాగా నోటీసులు జారీచేసింది. అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ పై నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది కరుణ సాగర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. 


విద్వేషపూరిత వ్యాఖ్యలు


దాదాపు పదేళ్ల క్రితం ఈ వ్యవహారం జరిగింది. మజ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ - ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి. ఆ మాటలు రెండు మతాల మధ్య నిప్పు రాజేశాయి. ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది.  నిర్మల్‌లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదేళ్ల క్రితం అంటే 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ ఓ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది.  ఆ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరితంగా మాట్లాడారు. ఆ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపాయి.


అక్బరుద్దీన్ స్పీచ్ దుమారం


అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ఏంటంటే... ‘‘మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే  మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం..’’ అంటూ అక్బరుద్దీన్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ (నేరపూరిత కుట్ర), 153 ఏ (రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం), 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం), 298 (ఏదైనా వ్యక్తి యొక్క మతపరమైన భావాలను భంగం కలిగేలా ఉద్దేశపూర్వక ప్రసంగం), 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. 


ఈ కేసుల్లో క్లీన్ చీట్ 


ఆ సమయంలో అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చాక పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైన అక్బరుద్దీన్ అప్పట్లో 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇదే కాకుండా ఆదిలాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతలపైన అనకూడని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులపై నాంపల్లి కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ కేసుల్లో అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో న్యాయవాది కరుణ సాగర్ హైకోర్టును ఆశ్రయించారు.