Fight Over Girlfriend:


ఇండోర్‌లో ఘటన..


గర్ల్‌ఫ్రెండ్ కోసం గొడవలు పడుతున్న ఘటనలు ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇవి కాస్త హద్దులు దాటి చంపుకోవటం వరకూ వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇదే జరిగింది. గీతాభవన్ వద్ద రెండు వర్గాలు ఓ అమ్మాయి కోసం కొట్లాడుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ గొడవకు కారణమైన యువకుడిని పలాసియా పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ కేస్ నమోదు చేశారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. బర్వానీ జిల్లాలోని నివాళి వద్ద నివసించే క్షితిజ్ సోనీ అనే యువకుడికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. అయితే అంతకు ముందు రాజ్‌దీప్ అనే మరో యువకుడితో ఆ అమ్మాయికి పరిచయం ఉంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని రాజ్‌దీప్...క్షితిజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో మాట మాట పెరిగింది. ఇద్దరి మధ్య గొడవ కాస్త రెండు వర్గాల మధ్య పోట్లాటకు కారణమైంది. ఒక్కసారిగా రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలు పెట్టారు. ఈ గొడవ కొద్ది సేపట్లోనే తీవ్రమైంది. సుజల్ అనే యువకుడు ఇందులో జోక్యం చేసుకుని అందరి కన్నా ముందుగా నిలబడగా...ఓ రాయి వచ్చి గట్టిగా తాకింది. తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్టూడెంట్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. "ఉన్నట్టుండి రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి మొదలైంది. ఓ ముగ్గురు యువకుల వల్లే ఇదంతా జరిగింది. యువకుడు మరణించటానికి కారణం కూడా వీళ్లే. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. మాట వినకపోవటం వల్ల రాళ్లు విసురుకున్నారు" అని పోలీసులు వెల్లడించారు. 


Also Read: Viral News: ఇదో రొమాంటిక్ ప్రేమ కథ- కారు 'గేర్' మార్చే స్టైల్ చూసి పడిపోయిందట!