గార వైస్ ఎంపీపీ బరాటం రామశేషు హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ నెల 6న రామశేషు స్వగ్రామమైన శ్రీకూర్మంలో కిరాతంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ మర్డర్ అధికార పార్టీతో పాటు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామశేషు మర్డర్‌కు గత నెలలోనే కొందరు పథకం పన్నారు. అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి తాను ఆ హత్య చేయలేనని తప్పుకోవడంతో మరొకరితో సుపారీ కుదుర్చుకుని హత్య చేశారు. తొలి నుంచి వెలువడుతున్నట్టు అధికార పార్టీకి చెందిన వారి మధ్య ఆధిపత్య పోరుతో పాటు ఇతర కారణాలతోనే రామశేషును కడతేర్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జీఆర్ రాధిక మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. 


అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గార మండలం శ్రీకూర్మంలో నివాసం ఉంటున్న బరాటం రామశేషుకు అదే పంచాయతీకి చెందిన తలకోల రవీంద్రారెడ్డి మధ్య రాజకీయ శతృత్వం ఉందని అన్నారు. వారి ఎదుగుదలకు రామశేషు అడ్డుపడుతుండడంతో హతమార్చాలని సుధాకర రెడ్డి, కుమారుడు రవీంద్రరెడ్డి ప్లాన్ చేసుకున్నారు. రామశేషును హతమార్చటానికి రవీంద్రా రెడ్డి నాలుగు లక్షలకు సుంకరపాలెంకు చెందిన సవడ శ్రీను అనే వ్యక్తికి సుఫారీ ఇచ్చారన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తితో మొదట ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన మర్డర్ చేయలేనని చెప్పడంతో సవడ శ్రీనును మర్డర్‌కు పురమాయించారు. సవడ శ్రీనుకు సుబ్బారెడ్డి సహకారం అందించే విధంగా స్కెచ్ వేశారు. ఆదిపత్య పోరుతో రగిలిపోతున్న సుధాకర్ రెడ్డి వీలున్నంత వేగంగా రామశేషును అంత మొందించాలని నిర్ణయించి అవకాశం కుదరడంతో ఈ నెల ఆరో తేదీన హత్య చేయించారు. గార పోలీసులు కేసు నమోదు చేయగా, శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం దర్యాప్తునకు రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజ్, సీడీఆర్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కేసు ఛేదించామని అన్నారు.


రామశేషు తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి, హెల్మెట్ పెట్టుకొని బైక్పై వచ్చి వాళ్ల దగ్గర ఉన్న కత్తితో రామశేషును నరికి చంపారన్నారు. ఆ కత్తిని దగ్గరలో పడేసి, అక్కడి నుంచి శ్రీకూర్మం మీదుగా బైక్పై పరారయ్యారన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో రామశేషుతో తొలినుంచి తలకోల సుధాకర్రెడ్డి, అతని కుమారుడు రవీందర్రెడ్డిల మధ్య వర్గపోరు ఉన్నట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరి కోసం గాలించగా పరారయ్యారన్నారు. వారికి చెందిన షెడ్‌లో ఇద్దరు కొత్త వ్యక్తులు సుమారు రెండు నెలల నుంచి ఉండేవారని వచ్చిన సమాచారం మేరకు ఈ హత్య వారే చేయించి ఉంటారని అనుమానం కలిగిందన్నారు. 


తలకోల సుధాకర్ రెడ్డి, అతని కొడుకు రవీందర్ రెడ్డిలతోపాటు మరో ఇద్దరిని ఆమదాలవలస రైల్వే స్టేషన్ వద్ద శనివారం పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో విచారించామని అన్నారు. సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డిల ఎదుగుదలకు బరాటం రామశేషు అన్ని విధాలుగా అడ్డుపడుతుండడం, అవమానాలకు గురి చేయడంతో రామశేషును ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో రవీందర్ రెడ్డికి పరిచయం ఉన్న మల్లెల వెంకటసుబ్బారెడ్డితో నాలుగు లక్షల రూపాయలకు కిరాయికి ఒప్పందం చేసుకున్నామని నిందితులు తెలిపారన్నారు. 


రెండు నెలలక్రితం నుంచి తమ షెడ్డులో ఉంచి అవకాశం కోసం ఎదురు చూడడంతో పాటు రెక్కీ నిర్వహించారు. ఈ నెల 6న సుంకరపాలెం గ్రామానికి చెందిన సావాడ శ్రీనుతో కలిసి రామశేషును హత్య చేయించారు. సావడ శ్రీను, సుబ్బారెడ్డిలకు చెరో పదివేల రూపాయలు చొప్పున రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఇచ్చిన సమయంలో పోలీసులు రావడం చూసి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నామని అన్నారు. అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 20 వేల రూపాయలు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, కత్తిని, సెల్ ఫోన్ లను స్వాధీనపరుచుకున్నామని అన్నారు. సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, సావాడ శ్రీను లను కోర్టులో హాజరుపరుస్తామని రాధిక తెలిపారు.