తాను లేని లోకంలో తన పిల్లాడు ఉంటే.. ఏమైపోతాడోనని భయపడింది. అందుకే అతడిని నడుముకు కట్టుకొని మరీ ఓ చెరువులో దూకేసింది. విషయం గుర్తించిన పశువుల కాపర్లు వాళ్లను కాపాడే ప్రయత్నం చేశారు. తల్లీ, కొడుకులిద్దరినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే బాబు మృతి చెందగా.. ఆమె మాత్రం బ్రతికిపోయింది. 


నాలుగేళ్ల క్రితమే శరత్, స్వాతిలకు పెళ్లి..!


కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత కుమారుడితో సహా చెరువులోకి దూకింది. కుమారుడు మృతి చెందగా... తల్లి ప్రాణాలతో బయట పడింది. ఈ విషాధ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలో జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన చింతల స్వాతికి ముస్తాబాద్ మడలం బదనకల్‌కు చెందిన శరత్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ బాబు కూడా పుట్టాడు. అతడే మూడేళ్ల శివతేజ. అయితే బాబు పుట్టిన రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. 


తాను లేకపోతే తన పిల్లాడేమైపోతాడోనని..


అత్తగారింట్లో జరిగే గొడవలు భరించలేక ఆమె బాబును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. మల్యాల గ్రామంలో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటుంది. అయితే కుటుంబ పోషణ కోసం సిద్దిపేటలోని ఓ షోరూంలో పని చేస్తోంది. అప్పుడప్పుడు భర్త శరత్ ఫోన్ చేస్తూ.. గొడవ పడుతుండేవాడు. గత కొంత కాలంగా నేరుగా వచ్చి తరచూ వేధింపులకు పాల్పడుతుండటంతో స్వాతి తీవ్రంగా మనస్తాపం చెందింది. ఎక్కడ ఉన్నా తనకు ఈ వేధింపులు తప్పేలా లేవని భావించింది. ఇలా గొడవలతో బతకడం కంటే చనిపోవడమే నయం అనుకుంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ తను చనిపోతే.. తన ఏమైపోతాడోనన్న భయం పట్టుకుంది. తల్లిలేని లోటును ఎవరూ తీర్చలేరని... తనతో పాటే బాబుని కూడా తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్లాలనుకుంది. 


తల్లీకుమారులను ఒడ్డుకు చేర్చిన పశువుల కాపర్లు..


శివతేజను తీసుకుని గ్రామంలోని చెరువు వద్దకు వచ్చింది. బాబుని గట్టిగా తన నడుముకు కట్టుకొని గ్రామంలోని చెరువులో దూకేసింది. అయితే విషయం గమనించిన పుశువుల కాపర్లు వెంటనే చెరువులోకి దూకారు. తల్లీకొడుకులిద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కుమారుడు శివతేజ మృతి చెందాడు. స్వాతి మాత్రం ప్రాణాలతో బయటపడింది. తాను ప్రాణం తీసుకోవాలనుకుంటే తన కొడుకు చనిపోయాడని కన్నీరుమున్నీరవుతోంది. తనను ఎందుకు బతికించారని పశువుల కాపర్లపై కోప్పడింది. కాపాడిన మీరే చంపేయండంటూ విలపించింది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మనవడి మృతదేహాన్ని చూసి బావురుమన్నారు. ఎందుకింత పని చేశావంటూ కూతరు స్వాతి పట్టుకొని ఏడ్చారు. అయితే తాను ఇలా చేయడానికి తన భర్తే కారణం అని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.