Hyderabad Latest News: సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, పాపను అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితుడు తన భార్య, పిల్లల్ని చంపేసి అనంతరం తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు నిందితుడు తాను తన భార్య పిల్లల్ని చంపినట్లుగా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి తెలపడం గమనార్హం.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భార్యపై అనుమానంతో పది నెలల చిన్న పాపతోపాటు భార్య స్వప్నను గణేష్ అనే వ్యక్తి చంపేశాడు. అనంతరం అల్వాల్ లోని రైల్వే ట్రాక్ పైన గణేష్ సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందే అతను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పి మరీ తాను హత్య చేసిన విషయాలను పోలీసులకు చెప్పాడు. అంతేకాక, తాను కొద్దిసేపటిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు కూడా పోలీసులకు తెలిపాడు. 


దీంతో మృతదేహాలను బోయిన్ పల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వీరి సంతానం మరో ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ నాలుగు నెలల క్రితం బోయిన్ పల్లికు వచ్చి నివాసం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.