Road Accident News: ఖమ్మం జిల్లాలో ఈరోజు ఉదయం మూడో చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఘటనల్లో మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మరో ముగ్గురు ప్రామాలు విడిచారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 


గురువారం రోజు ఉదయం ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రగాయాలపాలైన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిని వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేశ్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్ గా గుర్తించారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేశ్ ఉద్యోగం చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 


కల్లూపు మండలం రంగంబంజరలో ఓ ఆటో లారీని ఢీకొట్టింది. సాయితేజ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటన పెనుబల్లి మండలం వీఎం బంజారాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కుని ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. 


తిరుపతిలో తెలంగాణవాసుల మృతి..!




తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ఆర్టీసి బస్సును ఢీకొనగా.. ముగ్గురు మృతి చెందారు. మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి -శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఈ ప్రమాదం జరగ‌్గా.. మృతుల్లో భార్యాభర్తతో పాటు చిన్నారి పాప కూడా ఉంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతులతో పాటు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన కుటుంబంగా గుర్తించారు. 




ఇటీవలే మొదక్ లో రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం



మెదక్‌ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు ఆటోను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇంకో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మణెమ్మ (60), బాల నర్సయ్య (65) అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు చెప్పారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ అనే వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.